
ప్రధాని నరేంద్ర మోడీ 2023 జూన్ 27 మంగళవారం రోజున ఉదయం 10.30గంటలకు ఒకే సారి ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మొత్తం ఐదు కొత్త వందేభారత్ రైళ్లలో రెండు రైళ్లు మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుండగా.. కర్ణాటక, బిహార్, గోవాల నుంచి మరో మూడు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 17 రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల పరుగులు తీస్తు్ండగా, తాజాగా మరో ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో ఆ సంఖ్య 23కి చేరుకుంటుంది.
ధార్వాడ్- బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్
ధార్వాడ్- బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కర్ణాటకలోని ధార్వాడ్, హుబ్బళ్లి, దేవనగరి పట్టణాలను బెంగళూరుకు కలుపుతూ సర్వీసులందిస్తుంది. కర్ణాటకకు సంబంధించి ఇది రెండో వందేభారత్ రైలు. ఇప్పటికే చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య వందేభారత్ రైలు నడుస్తోంది. కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ బెంగళూరుహుబ్బలి-ధార్వాడ్ మధ్య 6 గంటల 13 నిమిషాల్లో దాదాపు 490 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు బెంగళూరు నుంచి ఉదయం 5:45 గంటలకు బయలుదేరి 11:58 గంటలకు ధార్వాడ్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.
భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
మోడీ ప్రారంభం చేయనున్న రైళ్లలో మధ్యప్రదేశ్లో రెండు రైళ్లు ఉన్నాయి. అందులో ఒకటి భోపాల్ నుంచి జబల్పూర్ మార్గంలో నడవనుండగా.. ఇంకోటి భోపాల్ నుంచి ఇండోర్ వెళ్తుంది. ఇప్పటికే న్యూఢిల్లీ- భోపాల్ వందే భారత్ రైలు నడుస్తున్నందున భోపాల్- ఇండోర్ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండో వందే భారత్ రైలుగా నిలుస్తుంది. మధ్యప్రదేశ్లో భోపాల్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న రైలు దేశంలోనే అంత్యంత వేగవంతమైన రైలుగా నిలుస్తోంది.
భోపాల్- జబల్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్
రాణి కమలాపతి-జబల్పూర్; ఖజురహో-భోపాల్-ఇండోర్ మధ్య రెండు రైళ్లు ప్రారంభం కానున్నాయి. రాణికమలాపతి-జబల్పూర్ వందే భారత్ రైలు మహాకౌసల్ ప్రాంతం (జబల్పూర్) నుంచి సెంట్రల్ రీజియన్ (భోపాల్)ను కలుపుతూ ప్రయాణికులకు సేవలందించనుంది. బెహ్రాఘాట్, పచ్మడి, సాత్పూర తదితర పర్యాటక ప్రాంతాల మీదుగా కనెక్టివిటీ ఏర్పాటు చేశారు.
ముంబై- గోవా వందే భారత్ ఎక్స్ప్రెస్
గోవా రాష్ట్రానికి సంబంధించిన తొలి సెమీ హైస్పీడ్ రైలు ఇదే . ఈ రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి గోవాలోని మడ్గావ్ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది. గతంలో వేగంగా ప్రయాణించే రైళ్లతో పోలిస్తే ఈ రైలు ద్వారా గంట సమయం ఆదా కానుంది. వాస్తవానికి ఇది 2023 జూన్ 3 ప్రారంభం జరగాల్సి ఉంది. అయితే ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాదం కారణంగా దాని ప్రారంభోత్సవం ఆలస్యమైంది.
పట్నా- రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్
బిహార్, ఝార్ఖండ్ మధ్య నడవనున్న తొలి వందే భారత్ రైలు ఇదే కావడం విశేషం. ఈ రూట్లో వందే భారత్ రైలు ఆరు గంటల పాటు ప్రయాణం చేయనుంది. ఇండియన్ రైల్వేస్ చరిత్రలోనే ఈ రూట్ అంత్యంత పొగ మంచుతో కూడుకున్న రూట్గా చెబుతుంటారు.