- సింగపూర్, లండన్, న్యూయార్క్ ఫైనాన్షియల్ హబ్లతో పోటీ
- ఫలితాన్ని ఇస్తున్న మోడీ విజన్
- తాజాగా బ్రాంచులు ఓపెన్ చేసేందుకు ముందుకొచ్చిన 18 కంపెనీలు
బిజినెస్డెస్క్, వెలుగు: గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-–సిటీ (గిఫ్ట్) కి ఫైనాన్షియల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా గిఫ్ట్లో బ్రాంచులు ఓపెన్ చేసేందుకు జేపీ మోర్గాన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కేపీఎంజీ వంటి సంస్థలు అప్లికేషన్లు పెట్టుకున్నాయి. మొత్తం 18 ప్రపోజల్స్ వచ్చాయని గిఫ్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) ప్రకటించింది. అహ్మదాబాద్కు చేరువలో డెవలప్ అవుతున్న గిఫ్ట్, ఫారిన్ ఫైనాన్షియల్ కంపెనీలను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది. కాగా, ప్రధానంగా ఐటీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, సెక్యూరిటీ (షేర్లు) మార్కెట్ వంటి సెగ్మెంట్లకు చెందిన కంపెనీలను ఆకర్షించేందుకు ఈ గిఫ్ట్ సిటీని డెవలప్ చేస్తున్నారు.
283 కి మొత్తం కంపెనీలు..
గిఫ్ట్ సెజ్లో కొత్తగా ఓ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఎన్ఎస్డీఎల్ డేటా మేనేజ్మెంట్ చూస్తోంది. ఇది నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) కు చెందిన సబ్సిడరీ. గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) లో తమ ఆపరేషన్స్ను ప్రారంభించేందుకు చాలా కంపెనీలు అప్లికేషన్లు పెట్టుకున్నాయని గిఫ్ట్ సిటీ సీఈఓ తాపన్ రాయ్ అన్నారు. ఈ ఏడాది గిఫ్ట్ సిటీలోని కంపెనీలు 265 కి చేరుకున్నాయి. తాజా అప్లికేషన్లకు కూడా అనుమతులొస్తే ఈ కంపెనీల సంఖ్య 283 కి చేరుతుంది. 2019 లో గిఫ్ట్ సిటీలో 140 కంపెనీలు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగించేవే. గత ఏడాది కాలంలో గిఫ్ట్ సిటీలో కంపెనీల సంఖ్య 62 శాతం పెరిగింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల విలువ 125 బిలియన్ డాలర్లను క్రాస్ చేయడం విశేషం. డచ్, హెచ్ఎస్బీసీ, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, స్టాండర్డ్ ఛార్టర్డ్, బార్క్లేవ్స్ వంటి కంపెనీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. ఈ బ్యాంకులు తమ బ్రాంచులను గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ తమ మొదటి టైర్ 1 ఆఫ్షోర్ (విదేశీ) బాండ్లను గిఫ్ట్ సిటీ నుంచి సేకరించడం విశేషం.
టాప్ కంపెనీల చూపు ఐఎఫ్ఎసీ వైపు..
గిఫ్ట్ సిటీని దేశానికి ఫైనాన్షియల్ హబ్గా మార్చాలని ప్రభుత్వం చూస్తోంది. బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉండడం, ట్యాక్స్లు కూడా తక్కువగా ఉండడం, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ హబ్లకు పోటీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండడం వంటి కారణాలు ఇన్వెస్టర్లను గిఫ్ట్ సిటీ వైపు ఆకర్షిస్తున్నాయి. గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ కేవలం ఇండియన్ కంపెనీలనే కాకుండా విదేశీ కంపెనీలను కూడా ఆకర్షిస్తోందని తాపన్ రాయ్ పేర్కొన్నారు. విదేశీ ఫైనాన్షియల్ సంస్థలు తమ బ్రాంచులను ఓపెన్ చేస్తుండడంతో ఇండియా నుంచి ట్రేడింగ్ పెరుగుతుందని, క్యాపిటల్ కూడా పెద్ద మొత్తంలో చేతులు మారతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. గిఫ్ట్ సిటీ ఎకొసిస్టమ్ విస్తరిస్తోందని, ముఖ్యంగా కరోనా సంక్షోభం నుంచి వేగంగా విస్తరిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) తీసుకొచ్చిన నిలకడైన రెగ్యులేటరీ ఎకోసిస్టమ్ వలన గిఫ్ట్ ఐఎఫ్ఎస్లోకి గత కొన్ని నెలల నుంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని ఐఎఫ్ఎస్సీఏ హెడ్ ఆఫ్ డెవలప్మెంట్ దిపేష్ షా అన్నారు.
గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ అంటే..
దేశంలోని ఫైనాన్షియల్ కంపెనీలయినా, విదేశీ కంపెనీలయినా తమ సొంత దేశం నుంచి కాకుండా విదేశాల్లో తమ బ్రాంచులను ఓపెన్ చేసి ఆఫ్ షోర్ (విదేశీ) ట్రాన్సాక్షన్లను చేపడుతుంటాయి. దీని వలన ట్యాక్స్ భారం తగ్గించుకోవచ్చని చూస్తాయి. గిఫ్ట్కు 2011 లో ఐఎఫ్ఎస్సీ స్టేటస్ వచ్చింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లకు చేరుకోవడానికి ఇండియా నుంచి ఈ సెంటర్ సులభమైన, ఖర్చు తక్కువతో కూడుకున్న మార్గంగా మారుతోంది. ఫైనాన్షియల్ కంపెనీలు ఫండ్స్ను సేకరించాలంటే దేశంలో అనేక రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అదే గిఫ్ట్లో ఉన్న కంపెనీలకు ఈ సమస్య ఉండదు. గిఫ్ట్ ఐఎఫ్ఎస్ఎల్లో ఉన్న బ్యాంకు బ్రాంచును విదేశాల్లోని బ్రాంచులానే చూస్తారు. ఇక్కడ ట్రాన్సాక్షన్లు (రూపాయిలో కాకుండా) విదేశీ కరెన్సీల్లో జరుగుతుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఐటీ, ఐటీ రిలేటెడ్ కంపెనీలను ఆకర్షించడానికి ఈ సెంటర్ను డెవలప్ చేస్తున్నారు. తాజాగా ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ను గిఫ్ట్లో ఓపెన్ చేశారు. దీని ద్వారా యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
గిఫ్ట్ సిటీ ఎందుకంత స్పెషలంటే?
గిఫ్ట్ సిటీని మొత్తం 986 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. ఇందులోనే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) డెవలప్ అవుతోంది. డొమెస్టిక్గా సేవలందించాలనుకునే ఫైనాన్షియల్ కంపెనీల కోసం, ఇంటర్నేషనల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్లను అందించాలనుకునే కంపెనీల కోసమూ సపరేట్గా జోన్లను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2006 టైమ్లో గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్లకు ధీటుగా ఇండియాలో కూడా ఒక సెంటర్ ఉండాలని గిఫ్ట్ను ప్రారంభించారు. మొదట ఐఎల్ అండ్ ఎఫ్ఎస్తో కలిసి గుజరాత్ గవర్నమెంట్ ఈ సిటీని డెవలప్ చేయడం ప్రారంభించింది. స్టార్టింగ్లో ఈ ప్రాజెక్ట్ పెద్ద ఫెయిల్యూర్ అని భావించారు. కానీ, రెగ్యులేషన్స్లో మార్పులు చేయడం, గిఫ్ట్ సిటీలో ఏర్పాటయ్యే కంపెనీలకు కొన్ని ట్యాక్స్ రూల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం, గ్లోబల్ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంచడంతో ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్టర్లను ఆకర్షించగలుగుతోంది.