హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసిన శంకర్ రావు తెలిపారు. శుక్రవారం 30 బీసీ సంఘాల ప్రతినిధులతో అమరావతిలోని సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కులగణన పూర్తయ్యి, బీసీల లెక్క తేల్చాకే నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు చట్టం చేయాలన్నారు.
ఈ నెల 16న పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా కోటా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్నారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్చేశారు. ఏపీలోనూ డెడికేషన్ కమిషన్ ద్వారా సమగ్ర కులగణన చేపట్టి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం పెంచాలనీ సీఎంను కోరినట్లు చెప్పారు.
