
లూసైల్ స్టేడియంలో ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో ఫిఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా మూడోసారి కప్పు నెగ్గింది. ఈ క్రమంలో ఆ జట్టుపై అభినందనలు వెల్లువెత్తున్నాయి. అందులో భాగంగా భారత ప్రధాని మోడీ అర్జెంటీనా టీమ్ ను అభినందించారు.
ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితమైన ఫుట్బాల్ మ్యాచ్లలో ఒకటిగా గుర్తుండిపోతుందని మోడీ అన్నారు. ఈ విజయంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారని మోడీ ట్వీట్ చేశారు. ఈ టోర్నీలో ఫ్రాన్స్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శనను కూడా మోడీ ప్రశంసించారు. ఫైనల్స్కు చేరేవరకూ కూడా వారు తమ నైపుణ్యం, క్రీడాస్ఫూర్తితో ఫుట్బాల్ అభిమానులను కూడా ఎంతగానో అలరించారని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 4 –2 పాయింట్లతో అర్జెంటీనా ఫ్రాన్స్ పై విజయ భేరి మోగించి. మూడోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అర్జెంటీనా టీమ్ను ముందుండి నడిపించిన మెస్సీ, డబుల్ గోల్స్తో సత్తా చాటగా.. ఫ్రాన్స్ తరఫున కిలియన్ ఎంబాపె మూడు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. మెస్సీనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవగా.. టోర్నీలో 8 గోల్స్ కొట్టిన ఎంబాపె గోల్డెన్ బూట్ అవార్డు గెలిచాడు. వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా గోల్డెన్ ట్రోఫీతో పాటు రూ.347 కోట్ల ప్రైజ్మనీ సొంతం చేసుకుంది.