
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన పదకొండున్నర గంటల సమయంలో బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్ కుమార్ తదితరులు మోడీకి ఘనస్వాగతం పలికారు. బేగంపేట్ విమానశ్రయం నుంచి నేరుగా మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనునన్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. హైదరాబాద్కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తామని వెల్లడించారు.
సుమారు రెండు గంటలసేపు నగరంలో పర్యటించనున్న ప్రధాని రూ.11 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని కార్యక్రమాల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానించారు. బహిరంగసభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కూడా షెడ్యూలులో చేర్చారు. కానీ.. ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ ప్రకటించారు