జూన్ 4న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఫస్ట్ టైమ్ మంత్రివర్గ సమావేశం

జూన్ 4న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఫస్ట్ టైమ్ మంత్రివర్గ సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2025, జూన్ 4వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‎కు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర మంత్రి మండలి భేటీ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఆపరేషన్ సిందూర్‎లో భారత యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయో చెప్పాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని.. దీనిపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం  ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలంగా డిమాండ్ చేస్తోంది. తన వల్లే పాక్, భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతుంటే.. దీనిపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. 

ఈ క్రమంలో జూన్ 4న భేటీ కాబోతున్న కేంద్ర కేబినెట్.. ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ గురించి డిస్కస్ చేసేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు టాక్.