
- అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన పాల్గొని తెలంగాణ అమరవీరులకు, జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఐడీవోసీ ఆఫీస్కు చేరుకుని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రభుత్వం 3,098 సంఘాలకు రూ.256 కోట్లు, 6,255 సంఘాలకు రూ.10 .53 కోట్లు వడ్డీలేని రుణాలు మంజూరు చేశామన్నారు.
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కింద జిల్లాలో ఇప్పటి వరకు 1.24 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేయగా, రూ.1.23 కోట్లు ఆదా అయ్యాయన్నారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,233 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. రైతుభరోసా కింద జిల్లాలో 1,01,479 మంది రైతులకు రూ.94.97 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. వానాకాలంలో 204 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 21,779 మంది రైతుల నుంచి 1.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.162.84 కోట్లు రైతులకు అందించామని, సన్నరకం ధాన్యానికి రూ.41 కోట్లు బోనస్ చెల్లించామన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అడిషనల్కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.