పోలవరం బ్యాక్ వాటర్​తో తెలంగాణకు కలిగే ముంపు ముప్పుపై సర్వే

పోలవరం బ్యాక్ వాటర్​తో  తెలంగాణకు కలిగే ముంపు ముప్పుపై సర్వే
  • ఆరు వాగుల క్రాస్ సెక్షన్ల వద్ద ముంపు ప్రభావంపై స్టడీ
  • ఇటు ఐఐటీ హైదరాబాద్​తోనూ స్టడీ చేయించనున్న సర్కారు
  • హైడ్రాలజీ ప్రొఫెసర్ సతీశ్​తో సర్వే
  • టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ

హైదరాబాద్, వెలుగు:పోలవరం బ్యాక్ వాటర్​తో మన రాష్ట్రంలో కలిగే ముంపు ముప్పుపై సర్వే చేసేందుకు ఎట్టకేలకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో కలిసి సీడబ్ల్యూసీ ముంపుపై జాయింట్ సర్వే చేయనుంది. ఈ మేరకు పీపీఏ ఆ వివరాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తెలంగాణలోని ఆరు వాగుల వద్ద సమస్య ఏర్పడుతుందని ఎప్పటి నుంచో మన అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

దానిపై సర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆరు వాగులపై సీడబ్ల్యూసీ తరఫున హైడ్రాలజీ నిపుణుడు సంజీవ్ సర్వేలో పాల్గొంటారని పీపీఏ మెంబర్ సెక్రటరీ వెల్లడించారు. వాగులు గోదావరి నది కలిసే క్రాస్ సెక్షన్ల వద్ద స్టడీ చేయనున్నారు. ఆ ఆరు క్రాస్ సెక్షన్లకు సంబంధించిన డేటా ఇవ్వాల్సిందిగా పీపీఏని సీడబ్ల్యూసీ ఈ నెల 23న కోరింది. 

ఈ ఆరు వాగుల క్రాస్ సెక్షన్ల వద్ద స్టడీ..

గోదావరి నదికి ఎడమవైపున తురుబాక వాగు కలిసే చోట 33 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లకు సర్వే చేయనున్నారు. ఏటపాక వాగు కలిసే 3.5 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 500 మీటర్లకు, మరో స్థానిక వాగు కలిసే చోట ఒక కిలోమీటర్​ పరిధిలో ప్రతి 200 మీటర్లకు, ఏదుళ్లవాగు కలిసే చోట 19.5 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లకు, పెద్దవాగు కలిసే చోట 24 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లు, దోమలవాగు కలిసే చోట 23 కిలోమీటర్ల పరిధిలో ప్రతి 750 మీటర్లకు ముంపు సీడబ్ల్యూసీ స్టడీ చేయనుంది. వాటికి సంబంధించి గోదావరి నది వద్ద అవి కలిసే ప్రాంతాల అక్షాంశ, రేఖాంశాల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. ఇటు దోమలవాగు.. కిన్నెరసాని నదిలో కలిసే చోటు, కిన్నెరసాని గోదావరిలో కలిసే చోటుకు సంబంధించిన వివరాలనూ ఇవ్వాలని కోరింది. 

ఐఐటీ హెచ్​తో కూడా స్టడీ..

సీడబ్ల్యూసీతో పాటు సమాంతరంగా ఐఐటీ హైదరాబాద్​తోనూ మన అధికారులు స్టడీ చేయించనున్నారు. ఐఐటీ హైదరాబాద్​లోని హైడ్రాలజీ నిపుణుడైన ప్రొఫెసర్ రేగొండ సతీశ్ కుమార్​తో ముంపుపై సర్వే చేయించనున్నారు. దానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్​నూ ఇప్పటికే ఇచ్చారు. దానిపై ప్రొఫెసర్ సతీశ్​కు ఇటీవల ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు.

దాని ప్రకారం పోలవరం ప్రాజెక్ట్, గోదావరి నదికి భద్రాచలం టౌన్, ముఖ్యమైన నిర్మాణాలకు సంబంధించి జియోగ్రాఫికల్ కో ఆర్డినేట్స్​తో లొకేషన్ అనాలిసిస్ చేయాలని సతీశ్​ను కోరారు. ‘‘గోదావరి నదీ ప్రవాహ తీరు, పూడిక, హైడ్రాలజీ వంటి వాటిపై దుమ్ముగూడెం నుంచి రాష్ట్ర సరిహద్దులకు వరకు సర్వే చేయాలి. పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల వద్ద స్టోర్ చేస్తే దాని బ్యాక్ వాటర్ వరదతో రాష్ట్రంలో ఎంత మేర ముంపుంటుందో తేల్చాలి.

పూర్తిస్థాయిలో స్టోర్ చేస్తే భద్రాచలం టౌన్​పై ఏ మేరకు ప్రభావం ఉంటుందో తేల్చాలి. గోదావరిలో కిన్నెరసాని కలిసే చోట నుంచి ముంపు ఎంత ఉంటుందో తేల్చాల్సి ఉంటుంది. ఫ్లడ్ ఎన్నాళ్లుంటుందో.. దాని తీవ్రత ఎంతో.. దాని వల్ల కలిగే ప్రభావం, పరిణామాలను అంచనా వేయాలి. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్​పై సీడబ్ల్యూసీ మోడల్ స్టడీస్​కు అనుగుణంగా దీనిపై స్టడీ చేయాలి. బ్యాక్​ వాటర్ వరదల నుంచి భవిష్యత్​లో చేపట్టాల్సిన రక్షణ చర్యలను సూచించాలి’’ అని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్​లో పేర్కొన్నారు.

జీసీ లింక్​పై జూన్​ 24న మీటింగ్​

గోదావరి–కావేరి(జీసీ) లింక్​పై నేషనల్ వాటర్ డెవలప్​మెంట్ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) మరోసారి సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే ఐదు సార్లు సమావేశమైన ఎన్​డబ్ల్యూడీఏ.. తాజాగా ఆరోసారి సమావేశం కానుంది. జూన్ 24న హైదరాబాద్​లోని జలసౌధలో సమావేశం నిర్వహించనున్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్, టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్​ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్​డబ్ల్యూడీఏ వెల్లడించింది.

గోదావరి కావేరి లింక్​లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యారేజీ ద్వారా తరలించాలనుకుంటున్న 148 టీఎంసీల్లో సగం ఇవ్వాలని, ఇచ్చంపల్లికి బదులు ఇప్పటికే రెడీగా ఉన్న సమ్మక్కసారక్క బ్యారేజీని వాడుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.