ఈ- క్రాసింగ్స్ యమ డేంజర్!.. మేడారం భక్తులకు పోలీస్​శాఖ అలర్ట్

ఈ- క్రాసింగ్స్ యమ డేంజర్!.. మేడారం భక్తులకు పోలీస్​శాఖ అలర్ట్

మేడారం(ములుగు), వెలుగు: ములుగు జిల్లాలోని మేడారం మహా జాతరకు వెళ్లే దారిలో చాలా క్రాసింగ్స్, జంక్షన్లు ఉన్నాయి. వీటి వద్ద జాగ్రత్తగా వెళ్లాలని పోలీస్​శాఖ సూచిస్తోంది. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే చాన్స్​ఉందని హెచ్చరిస్తోంది. సమ్మక్క, సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్‌‌, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బుధవారం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. వేల వాహనాలు మేడారం వైపు క్యూ కడుతున్నాయి. ఈ రూట్లలో ఒక్క వెహికల్​ఆగినా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్​ నిలుస్తుంది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ట్రాఫిక్ క్లియర్​చేయడం పోలీసులకు కత్తి మీద సాములా మారుతుంది. ఈ క్రమంలో ట్రాఫిక్​జామ్​తోపాటు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్‌ శాఖ భక్తులను అప్రమత్తం చేస్తోంది. మూలమలుపులు, రోడ్డు క్రాసింగ్స్, ముఖ్యమైన జంక్షన్ల వద్ద వెహికల్స్ ను వేగంగా నడపవద్దని, ఓవర్‌ టేక్‌‌ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. వన్‌‌వే రూల్స్‌‌ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

గుడెప్పాడ్‌‌ సర్కిల్ ​కీలకం

మేడారం జాతరకు వెళ్లే దారుల్లో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడ్‌ సర్కిల్​అతికీలకమైనది. రెండు నేషనల్‌ హైవేలను ఈ సర్కిల్​కలుపుతోంది. జాతర గుడెప్పాడ్‌‌ చాలా రద్దీగా ఉంటుంది. మేడారం వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్‌‌వెహికల్స్​అన్నీ గుడెప్పాడ్‌ ‌మీదుగానే వెళ్తాయి. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మల్లంపల్లి వైపు వెళ్లే వెహికల్స్​గుడెప్పాడ్​కు ఎడమవైపు‌, హనుమకొండ వైపు వెళ్లే వెహికల్స్​కుడివైపు వెళ్తాయి. అదే సమయంలో హనుమకొండ నుంచి మేడారం వెళ్లే వెహికల్స్‌‌ ఎదురుగా వస్తాయి. హైదరాబాద్‌‌, ఖమ్మం, మహబూబాబాద్‌‌, ఇల్లెందు తదితర ప్రాంతాల వాళ్లంతా ఈ సర్కిల్​లో క్రాస్​అవ్వాల్సి ఉంటుంది. ఏటా జాతర టైంలో ఈ సర్కిల్​ను క్రాస్​చేసేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

మల్లంపల్లి సర్కిల్‌‌ కూడా..

గుడెప్పాడ్‌‌ నుంచి సుమారు 20 కి.మీ దూరంలో మల్లంపల్లి సర్కిల్‌‌ ఉంటుంది. ఇది ములుగు జిల్లాలోని గ్రామం. ఇది కూడా రెండు నేషనల్‌ ‌హైవేలను కలిపే సర్కిల్. మహబూబాబాద్‌‌, ఖమ్మం జిల్లాల నుంచి మేడారం వెళ్లే భక్తులు ఇటుగా వస్తారు. హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వెహికల్స్​తో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో గుడెప్పాడ్‌‌ నుంచి వచ్చే వెహిల్స్​మల్లంపల్లి వద్ద క్రాస్‌‌ అయి, మహబూబాబాద్‌‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రైవర్లు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది.

అతి ముఖ్యమైన కూడలి పస్రా

మేడారం దారిలో అతి ముఖ్యమైన జంక్షన్​పస్రా. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉంటుంది. ఇక్కడి నుంచే ప్రతి వెహికల్ క్రాస్‌‌ అయి మేడారం వెళ్లాల్సి ఉంటుంది. గంటకు రెండు, మూడు వేల వాహనాలు మేడారం వైపు వెళ్తాయి. హైదరాబాద్‌‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ ‌జిల్లాల మీదుగా వచ్చే ఆర్టీసీ, వీఐపీ, ప్రైవేట్‌‌ వెహికల్స్​అన్నీ ఇక్కడికి చేరుకుంటాయి. ప్రైవేట్‌‌ వాహనాలు ఇక్కడి నుంచి ఎడమవైపు తిరిగి మేడారం చేరుకోవాలి. ఆర్టీసీ, వీఐపీ వాహనాలు నేరుగా తాడ్వాయి వైపు వెళ్లాలి. మేడారం నుంచి భక్తులను ఇంటికి తీసుకెళ్లే ఆర్టీసీ, వీఐపీ వాహనాలు కూడా ఎదురెదురుగా వచ్చి వాహనాలను క్రాస్‌‌ చేయాలి. జాతర జరిగే నాలుగు రోజులు లక్షల సంఖ్యలో వచ్చే వాహనాలన్నీ మలుపు తిరిగే క్రమంలో కాసేపు ఆగుతాయి. కాబట్టి ఈ కూడలి వద్ద డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తేడా జరిగితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌ నిలిచిపోతుంది. 

మూలమలుపుల వద్ద జాగ్రత్త

జాతర రూట్లలో వందలాదిగా మూలమలుపులు ఉన్నాయి. డబుల్‌ రోడ్లే అయినప్పటికీ ఓవర్​టేక్​చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాడ్వాయి, చిన్నబోయినపల్లి, కాటారం, కమలాపూర్‌‌, గాంధీనగర్‌‌పై చాలా మూలమలుపులు ఉన్నాయి. కొన్ని ప్రధాన కూడళ్లు కూడా ఎదురవుతాయి. మహారాష్ట్ర నుంమచి వచ్చే భక్తులు కాటారం మీదుగా, ఛత్తీస్‌‌గఢ్‌ ‌నుంచి వచ్చే వెహికల్స్‌‌ చిన్నబోయినపల్లి మీదుగా, ఆర్టీసీ, వీఐపీ, వీవీఐపీ వాహనాలు తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటాయి. మేడారం చేరుకునే వరకు ఎక్కడా కూడా ముందు వెళ్తున్న వెహికల్​ను  ఓవర్‌‌టేక్‌‌ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.