- యాప్స్ అడ్డాలుగా చైనా,ఇండోనేసియా
- ఇద్దరిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
- రూ. 30 కోట్లు ఫ్రీజ్ వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్, వెలుగు: ఇన్స్టంట్ లోన్ యాప్స్ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఐదు కంపెనీలతో లోన్ యాప్స్ ఆపరేషన్స్ చేసిన చైనా దేశస్తుడు హి జైన్ అలియాస్ మార్క్ (26), యూపీలోని వారణాసికి చెందిన వివేక్కుమార్ (26)లను మంగళవారం థానేలో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలించారు. నిందితుల నుంచి 4 ల్యాప్ టాప్స్, రూటర్స్, 3 పాస్పోర్ట్స్, కంపెనీల అకౌంట్లలోని రూ. 30 కోట్లు ఫ్రీజ్ చేశారు. నిందితుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం వెల్లడించారు.
చైనా నుంచే డ్రాగన్ లోన్ యాప్స్
చైనాకు చెందిన జునాన్, జు జిన్చాంగ్, జావో కియావో కలిసి 24 మైక్రో ఫైనాన్స్ లోన్ యాప్స్ కంపెనీలు ఏర్పాటు చేశారు. చైనా, ఇండోనేసియాలోని కంపెనీలకు వీళ్లు డైరెక్టర్లుగా ఉంటూ..ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థానికులనే డైరెక్టర్లుగా నియమించి లోన్ యాప్స్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర పుణెలోని జియా లియాంగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కాల్సెంటర్కు డైరెక్టర్గా అంకుర్సింగ్ను నియమించి పని స్టార్ట్ చేశారు. ఆ తరువాత చైనా జియాంగ్జీకి చెందిన హి జైన్ను 2019 జులైలో ఇండియాకు పంపించారు. చైనా డైరెక్టర్ల ఆదేశాలతో జియా లియాంగ్ కాల్ సెంటర్తో కనెక్టయిన లోన్ యాప్స్ను హి జైన్ ఆపరేట్ చేసేవాడు.
ఆపరేషన్ హెడ్స్గా చైనీయులే
జియా లియాంగ్తో పాటు థానేలో అజయ్ సొల్యూషన్స్, బైనెన్స్, ఎపోచ్ గో క్రెడిట్ సొల్యూషన్, తృతీగ్ ఫిన్టెక్ పేర్లతో మరో నాలుగు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. లోన్ యాప్స్ లింక్స్, కస్టమర్ల డేటాను కాల్ సెంటర్స్లోకి చైనా నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఫీడ్ చేసేది. ఇలా కనెక్టయిన 24 ఇన్స్టంట్ లోన్ యాప్స్కి చెందిన ఆపరేషన్స్ను హి జైన్ ఆపరేట్ చేసేవాడు. థానెలో నిర్వహిస్తున్న అజయ్ సొల్యూషన్స్ అకౌంటెంట్గా యూపీ వారణాసికి చెందిన వివేక్ కుమార్(26) పనిచేస్తున్నాడు. ఇతను ఎపోచ్ గో క్రెడిట్ అకౌంట్స్ను కూడా ఆపరేట్ చేస్తున్నాడు.
ఇండియాలో బిజినెస్ సక్సెస్ కావడంతో..
క్రేజి బీన్, క్రేజీ రుపీ, క్యాష్ ప్లస్, రుపీ ప్రొ, గోల్డ్ బౌల్, ఫస్ట్ క్యాష్, రియల్ రూపీ, ఇలా మొత్తం 24 యాప్స్ను జియా లియాంగ్ కాల్ సెంటర్తో కనెక్ట్ చేశారు. ఇండియాలో మైక్రో ఫైనాన్స్ బిజినెస్ సక్సెస్ కావడంతో తమ దేశానికి చెందిన వారిని హెడ్స్గా ప్రమోట్ చేశారు. బిజినెస్ వీసాలపై ఇండియాకు పంపించి లోన్ యాప్స్ ఆపరేషన్ చేయించారు. లోన్ యాప్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫోన్ డేటాను కాల్ సెంటర్స్కి అందించేవారు. అప్పు తీసుకున్న వాళ్లను నాలుగు స్టేజీలలో తీవ్రంగా వేధించేవారు. వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి అసభ్యకర కామెంట్స్తో ఫొటోలు పోస్ట్ చేసేవారు. వీళ్ల వేధింపులకు రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు.