హైదరాబాద్: భిక్షాటన చేసే పిల్లలని తీసుకొచ్చి, వారితో సెల్ ఫోన్ దొంగతనాలు చేయించే ముఠాను నార్సింగ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ జాయింట్ సీపీ వెంకటేశ్వరరావు ఈ అరెస్ట్ పై మాట్లాడుతూ… ‘చిన్నా అనే వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేసేవాడు. అంతటితో ఆగక జల్సాల కోసం తన స్నేహితులు శ్రీనివాస్, కిషోర్ లతో కలిసి నగరంలో భిక్షాటన పిల్లలను తీసుకొచ్చి వారితో దొంగతనాలు చేయించేవారు.
మొదట కర్నూలులో దొంగ తనాలు చేసే ఈ ముఠా అక్కడ పోలీసులకు పట్టుబడడంతో నగరానికి మకాం మార్చారు. నగరంలోని ముత్తంగి లో ఉంటు చోరీలు చేసేవారు..పబ్లిక్ ఎక్కువ ఉండే ప్రదేశాలే వీరి టార్గెట్. చౌరస్తా లలో బిక్షాటన చేసే పిల్లలను తీసుకొచ్చి వారిచేత చోరీలు చేయించేవారు. ఈ ముఠా ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం తో పాటు సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలలో సెల్ ఫోన్ల చోరీలు చేశారు.ఈ దొంగతనాలకు పాల్పడుతున్న చిన్న, శ్రీనివాస్, కిషోర్ లతో పాటు ఇద్దరు మైనర్లను నార్సింగ్ పోలీసులు అరెస్టు చేసినట్టు’ సీపీ తెలిపారు. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి 8 లక్షల రూపాయల విలువైన 52 మొబైల్ ఫోన్లు, 4 వెహికిల్స్ ను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
