హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో కలకలం రేపిన లాయర్ స్వప్న హత్య కేసులో షాకింగ్ విషయాలు వేలకుగులోకి వస్తున్నాయి. ఆస్తి కోసం స్వప్నను తన సొంత అన్న రాజు సుపారీ గ్యాంగ్ తో చంపించాడని భావించగా.. పోలీసుల విచారణలో రాజు స్వయంగా తన ఫ్రెండ్స్ తో కలిసి స్వప్నను హత్య చేసినట్లు తేలింది. స్వప్న బుధవారం ఉదయం తమ పొలంలో కొంత భూమిని అమ్మడం కోసం సర్వేయర్ తో భూమిని సర్వే చేయించిందని.. ఈ విషయం తెలుసుకున్న రాజు మిత్రులతో కలిసి పొలం దగ్గరికి వెళ్లి స్వప్నను చంపేసినట్లు తేలింది.
రాజు తన మిత్రులకు సహకారంతో కారుతో స్వప్నను ఢీ కొట్టి.. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతు కోసి, పక్కనే ఉన్న బండరాయిని తల పై మోది హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. లాయర్ స్వప్నను హత్య చేస్తున్న సమయంలో తన తల్లి వెంకటమ్మ అక్కడే ఉండి అరుపులు కేకలు వేసిన పట్టించుకోకుండా దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు.
ALSO READ : రూ. 15 లక్షల లంచం కేసు..
రాజు మరొక ముగ్గురు మిత్రులతో కలిసి తన కళ్ళముందే తన కూతురుని హత్య చేశారంటూ తల్లి వెంకటమ్మ కన్నీటి పర్యంతమవుతోంది. వృద్ధాప్యంలో ఉన్న తమ యోగక్షేమాలు చూసుకునే కూతురు స్వప్న హత్యను తల్లి వెంకటమ్మ, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.తన కూతురుని దారుణంగా హత్య చేసిన తన కొడుకు రాజుతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని అంటోంది వెంకటమ్మ.
స్వప్న హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మోయినాబాద్ పోలీసులు
- A1 గోటికె రాజు ( స్వప్న అన్న )
- A2 ఎర్రోళ్ల సందీప్
- A3 వడ్డె వీరేశం
- A4 కావలి శివలింగం
స్వప్నను హత్య చేసిన తర్వాత ఇన్నోవా కారు, స్కూటీలో నిందితులు పరారయ్యారని..నిందితులను అదుపులోకి తీసుకొని ఇన్నోవా కారు, స్కూటీ సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు.నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కొడవలి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.
