అతడో పెద్ద హంతకుడు. ఓ హత్య చేసి జైలు పాలయ్యాడు. మరో 12 దోపిడీలు, హత్యల్లో నిందితుడిగా ఉన్నాడు.
ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్. కోర్టులో విచారణకు వచ్చిన అతడిని చూసి మాట కలిపింది. పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అతడినే పెళ్లి చేసుకుంది.
ఎవరైనా ఊహిస్తారా నేరస్థులు, పోలీసుల మధ్య ఇలాంటి సంబంధం? కానీ, వాళ్లిద్దరి విషయంలో మాత్రం అదే జరిగింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన పాయల్ అనే కానిస్టేబుల్, రాహుల్ థరాసన (30) అనే గ్యాంగ్స్టర్ మధ్య నడిచింది ఆ ప్రేమాయణం. మన్మోహన్ గోయల్ అనే వ్యాపారి హత్య కేసులో 2014 మే 9న అరెస్టయిన రాహుల్ను గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్ కోర్టులో విచారణకు తీసుకొచ్చేవారు. ఆ టైంలో పాయల్ అక్కడే డ్యూటీ చేస్తుండేది. అతడిని చూసి మాట కలిపింది. అతడితో టచ్లో ఉండేది. ఆ పరిచయం వాళ్లిద్దరి మధ్యా ప్రేమగా మారింది. ఇటీవలే పాయల్, రాహుల్లు పెళ్లి చేసుకున్నారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఎక్కడ, ఎప్పుడు పెళ్లి చేసుకున్నది చెప్పలేదు కానీ, ప్రేమతో ఇద్దరం ఒక్కటయ్యామంటూ హంతకుడైన రాహుల్ పోస్ట్ పెట్టాడు. అయితే, ఈ పెళ్లి ఫొటోలు చూసిన పాయల్ పై అధికారులు షాక్ తిన్నారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. సూరజ్ పూర్ కోర్టు వద్ద డ్యూటీ తర్వాత గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ స్టేషన్లో పాయల్ డ్యూటీ చేసింది. ‘‘ప్రస్తుతం ఆమె ఎక్కడో పనిచేస్తోందో తెలియదు. ఓ నరహంతకుడిని పెళ్లి చేసుకున్న ఆమెపై మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ రణ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ పెళ్లి ఇప్పుడు యూపీ పోలీసులందరిలోనూ పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, అనిల్ దుజంగా అనే గ్యాంగ్స్టర్ గ్యాంగ్లో సభ్యుడని పోలీసులు చెబుతున్నారు. 2008లో తన నేర వృత్తిని ప్రారంభించాడంటున్నారు.