- ప్లబిక్ ప్లేసులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ సమావేశాలే టార్గెట్
- నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5.41 లక్షలు స్వాధీనం
- పోలీసుల అదుపులో ఇంకొందరు అనుమానితులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరుస బాంబు పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పబ్లిక్ ప్లేసులు, మీటింగ్స్లో బ్లాస్టింగ్స్ చేసేందుకు ప్లాన్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద 4 హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5.41 లక్షల నగదు, ఆరు సెల్ఫోన్లు, బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్తాన్ ఐసిస్ ఫండింగ్తో దేశవ్యాప్తంగా విధ్వంసాలకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు గుర్తించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లోని 8 ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు జరిపారు. 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ముసారాంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ (39), సైదాబాద్కి చెందిన సమీయుద్దీన్(39), మెహిదీపట్నానికి చెందిన మాజ్ హసన్ ఫరూక్ (29)లను అరెస్టు చేశారు. సోమవారం నాంపల్లి కోర్టులో వీరిని ప్రవేశపెట్టి, రిమాండ్కి తరలించనున్నారు.
దాడుల కోసం రిక్రూట్మెంట్
మలక్పేట్ ముసారాంబాగ్కి చెందిన అబ్దుల్ జాహెద్.. ఐసిస్ సానుభూతిపరుడు. ఐసిస్, లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థల్లో రిక్రూట్మెంట్ చేసేవాడు. 2005లో బేగంపేట్లోని టాస్క్ఫోర్స్ ఆఫీస్పై జరిగిన మానవ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు. బాంబ్ బ్లాస్ట్తో పాటు పలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పాకిస్తాన్ ఐసిస్, లష్కరే తొయిబా హ్యాండ్లర్స్తో కాంటాక్ట్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో బ్లాస్ట్లు చేసి పాకిస్తాన్ పారిపోయిన ఫరహతుల్లా ఘోరీ అలియాస్ ఎఫ్జీ సిద్దిఖీ బిన్ ఉస్మాన్, రఫిక్ అలియాస్ అబు హమ్జల్, అబ్దుల్ మాజీద్ అలియాస్ చోటుతో జాహెద్ కాంటాక్ట్లో ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి వచ్చే డబ్బులతో పేలుళ్లకు అవసరమైన ఎక్స్ప్లోజివ్స్, షెల్టర్స్ తీసుకున్నాడు. పాకిస్తాన్ ఐసిస్ హ్యాండ్లర్స్ ఆదేశాలతో బాంబుల తయారీ, బ్లాస్టింగ్స్కి అనువైన ప్రాంతాలు, పోలీస్ యాక్టివీటిస్ను తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే సైదాబాద్ అక్బర్బాగ్ ఆర్మన్ టవర్స్కు చెందిన సమీయుద్దీన్, మెహిదీపట్నం హుమాయున్ నగర్ రాయల్కాలనీకి చెందిన మాజ్ హసన్ ఫరూక్, మరికొంత మందిని ఐసిస్లో జాయిన్ చేశాడు. మిగతా వారితో కలిసి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వరుస విధ్వంసాలకు ప్లాన్ చేశాడు. పాకిస్తాన్ హ్యాండ్లర్స్ నుంచి 4 హ్యాండ్ గ్రనేడ్లు, బ్లాస్టింగ్ల కోసం కావాల్సిన ఫండ్ను సేకరించాడు.
పోలీసుల విచారణలో కీలక వివరాలు
లుంబినీపార్క్, గోకుల్చాట్ పేలుళ్ల తరహాలోనే పబ్లిక్ ప్లేసుల్లో బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్ల ద్వారా సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఈ కీలక ఆధారాలు లభించాయి. రాష్ట్రంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. రాష్ట్ర పోలీసులను అలర్ట్ చేశాయి. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. మూసారాంబాగ్, హఫీజ్బాబానగర్, సైదాబాద్, సంతోష్ నగర్, మెహిదీపట్నంలో సెర్చెస్ చేశారు. 25 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. జాహెద్, సమీయుద్దీన్, హసన్ నుంచి వివరాలు రాబట్టారు. దసరా, ఆర్ఎస్ఎస్, బీజేపీ మీటింగ్స్ను టార్గెట్ చేసినట్లు గుర్తించారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. అనుమానిత అకౌంట్స్లో భారీ మొత్తంలో పాకిస్తాన్ నుంచి డిపాజిట్ అయినట్లు గుర్తించారు. హైదరాబాద్కి చెందిన దిల్ అఫ్రోజ్, అబ్దుల్హైదర్, సోహైల్ ఖురేషీ, అబ్దుల్ ఖలీమ్లను ఐసిస్లో రిక్రూట్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
2002 నుంచి బ్లాస్టింగ్స్!
పాకిస్తాన్లో సెటిల్ అయిన ఫరహతుల్లా ఘోరీ.. ఐసిస్ ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నాడు. అక్కడి నుంచే హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఐసిస్లో రిక్రూట్ చేసేలా ప్లాన్ చేశాడు. జాహెద్ను హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేలా ఆదేశాలు ఇచ్చేవాడు. వీరి ఆధ్వర్యంలోనే హైదరాబాద్లో బాంబు బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు. బ్లాస్టింగ్స్ చేయాల్సిన ఏరియాలను మ్యాపింగ్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఫండింగ్ చేశారు. స్థానికంగా బాంబులు తయారు చేశారు. 2002లో దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద, 2004లో సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ దగ్గర్లో బాంబ్ బ్లాస్ట్కు యత్నించారు. ముంబై ఘట్కోపర్ వద్ద బస్సు బ్లాస్ట్ చేశారు. 2005లో బేగంపేట్ టాస్క్ఫోర్స్ ఆఫీస్ వద్ద ఆత్మాహుతి దాడి చేశారు.