జహీరాబాద్, వెలుగు: హత్య చేసి పూడ్చిన ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు వెలికి తీయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన మధుసూదన్ రెడ్డి(42) కొంతకాలంగా హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో ఉంటున్నారు. కర్నాటకకు చెందిన ఓ ఫ్రెండ్కు డబ్బులు అప్పుగా ఇచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కక్ష పెంచుకున్న ఆ వ్యక్తి పథకం ప్రకారం మధుసూదన్రెడ్డిని హత్య చేశాడు. మధుసూదన్ రెడ్డి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఈ నెల 19న చార్మినార్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. శనివారం చార్మినార్ పోలీసులు గాంధీ ఆస్పత్రి డాక్టర్లను వెంటబెట్టుకొని సంగారెడ్డి జిల్లా కోహీర్మండలం దిగ్వార్శివారుకు చేరుకున్నారు. అక్కడ పూడ్చిన శవాన్ని వెలికితీశారు. పంచనామా నిర్వహించి బంధువులకు శవాన్ని అప్పగించారు.