రాజేశ్​ది హత్యా? ఆత్మహత్యా?..పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు!

రాజేశ్​ది హత్యా? ఆత్మహత్యా?..పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు!
  •     రాజేశ్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

ఎల్ బీ నగర్, వెలుగు : హైదరాబాద్ సిటీ శివారులో జరిగిన యువకుడి హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతున్నది. ములుగు జిల్లాకు చెందిన రాజేశ్​ను ఎవరు చంపారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో హయత్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. హయత్​నగర్​లో ఉంటూ దేవరకొండలో పని చేస్తున్న గవర్నమెంట్ టీచర్ సుజాతతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సుజాత భర్త నాగేశ్వరరావును పోలీసులు విచారించినట్లు సమాచారం. రాజేశ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. 

సోషల్ మీడియాలో పరిచయం

రాజేశ్‌కు కొన్ని నెలల కింద సోషల్ మీడియాలో గవర్నమెంట్ టీచర్ సుజాతతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు తెలిసింది. వీరిద్దరి విషయం నాగేశ్వర రావుకు తెలియడంతో ఆమెను కొన్నిసార్లు మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈనెల 24న సుజాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ట్రీట్​మెంట్ పొందుతున్న టైంలో సుజాతకు రాజేశ్ చాలాసార్లు కాల్స్​ చేశాడు. దీంతో ఆమె బంధువులు రాజేశ్​పై దాడి చేసినట్లు సమాచారం. తర్వాత సుజాత చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఆమె ఇంటి చుట్టూ రాజేశ్ తిరుగుతుండగా ఆమె కొడుకు గమనించి  నిలదీసినట్లు సమాచారం. అయితే, రాజేశ్​ను ఎవరు హత్య చేశారనేది మాత్రం ఇంకా తేలలేదు.