
- హిజాబ్, కర్మన్ఘాట్ ఘటనలు, ఉక్రెయిన్పై దాడి దృష్ట్యా అలర్ట్
- ఐటీ సెల్, ఇంటెలిజెన్స్ టీమ్స్తో మానిటరింగ్
- బస్తీల్లో బ్లూ కోల్ట్స్ టీమ్స్ పహారా
హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో హిజాబ్ ఇష్యూ, కర్మన్ఘాట్ దాడి ఘటన, ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియా పోస్టింగులపై నిఘా పెట్టారు. రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు, కామెంట్లను పెట్టే వాళ్లను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ఐటీ సెల్, ఇంటెలిజెన్స్ టీమ్స్తో సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. కమ్యూనల్, హిస్టరీ షీట్స్ ఉన్న అనుమానితులపై నిఘా ఉంచారు. వాళ్ల వాట్సాప్ గ్రూపులపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగులు, కామెంట్ల డేటాను తీస్తున్నారు. గోవుల అక్రమ రవాణను అడ్డుకున్న గోరక్షక్ సభ్యులపై మంగళవారం కర్మన్ఘాట్లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బజరంగ్దళ్, గోరక్షక్, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం సంతోష్నగర్, కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.
బస్తీల్లో పహారా
ఓల్డ్సిటీతో పాటు గ్రేటర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి పూట పెట్రోలింగ్ పెంచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కమ్యూనల్ కేసుల్లో నిందితులుగా ఉన్నోళ్ల డేటాను కలెక్ట్ చేశారు. గత నెల రోజుల్లో వాళ్ల యాక్టివిటీలను తెలుసుకుంటున్నారు. బస్తీల్లో బ్లూ కోల్ట్స్ సిబ్బందితో పహారా చేస్తున్నారు. డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో ఎప్పటికప్పుడు మీటింగులు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు బెదిరింపులకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.