- కేసులో పొలిటికల్ ప్రెజర్స్ఉన్నాయనే ఆరోపణలు
- ఏవీ సుబ్బారెడ్డిని మొదట ఏ1గా చూపి తర్వాత ఏ2గా మార్చడంపై సందేహాలు
- ఇన్నిరోజులైనా అరెస్టు చెయ్యకపోవడంపై అనుమానాలు
- ఈ కేసులో కొందరు నేతలు, పోలీసులు బాగా ఇంట్రెస్ట్ చూపడమేంటనే చర్చ
- హఫీజ్పేట భూములు సొంతం చేసుకునే కుట్ర అన్న ప్రచారం
హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు వ్యవహారంలో ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కేసులో నిందితుల విషయంపై పోలీసులు వ్యవహరించిన తీరు, కొందరు నేతలు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కేసులో ఏవీ సుబ్బారెడ్డిని మొదట ప్రధాన నిందితుడి (ఏ1)గా చూపించడం, తర్వాత ఆయనను ఏ2గా మార్చి.. అఖిలప్రియను వెంటనే అరెస్టు చేయడం వంటి విషయాల్లో పోలీసుల ఓవర్ యాక్షన్ కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసు రోజురోజుకు హాట్ టాపిక్గా మారుతోంది. హఫీజ్పేట భూములను సొంతం చేసుకునేందుకు కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని.. ఆ పొలిటికల్ గేమ్లో భాగంగానే తమను టార్గెట్ చేశారని అఖిలప్రియ చెల్లెలు మౌనిక, ఇతర ఫ్యామిలీ మెంబర్లు ఆరోపిస్తున్నారు.
ఎన్నో సీరియస్ కేసుల్లో కనిపించని స్పీడ్ ఇన్వెస్టిగేషన్ ప్రవీణ్రావు, ఆయన తమ్ముళ్ల కిడ్నాప్ కేసులో కనిపించడం అనుమానాలు రేకెత్తిస్తోంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. హఫీజ్పేట్లోని భూమా ల్యాండ్స్పై పెద్దల కళ్లు పడ్డాయని అఖిలప్రియ చెల్లెలు మౌనికరెడ్డి ఆరోపణలు చేయటం గమనార్హం. అందుకే పోలీసులు మితిమీరిన వేగం ప్రదర్శిస్తున్నారని, మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ రాకుండా కట్టడి చేయటంతో పాటు.. నిందితులను పట్టుకునేందుకు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. . ఓ సివిల్ డిస్ప్యూట్తో కనెక్టయిన ఈ కేసులో సిటీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఇప్పటికే మౌనిక కుండబద్దలు కొట్టినట్లుగా విమర్శలు చేసింది. వాటిని నిజం చేస్తున్నట్లుగానే పోలీసు ఆఫీసర్లు దూకుడుగా వ్యవహరించటంతో.. ఈ ల్యాండ్ గొడవ వెనుక పెద్దలే చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. కోట్ల విలువైన భూమి కావటంతో.. ఇదే అదనుగా పెద్దలు పావులు కదుపుతున్నారని, కేసును టైట్ చేసి భూమి సెటిల్మెంట్ తమకు అనుగుణంగా చేసుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో పాటు ఏ1గ ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా మార్చడం వెనుక పొలిటికల్ డీల్ ఉన్నట్లు భూమా ఫ్యామిలీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే వారం గడుస్తున్నా ఏవీ సుబ్బారెడ్డిని(ఏ2)ను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తోంది. ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని అఖిలప్రియ కుటుంబం ఆరోపిస్తోంది.
సివిల్ గొడవలో పోలీసుల ప్రమేయం లేదు: సీపీ
భూమా ఫ్యామిలీకి సంబంధించి సివిల్ గొడవతో పోలీసులకు సంబంధం లేదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కేవలం కిడ్నాప్ కేసులోనే జరుపుతున్నామని.. ఇలాంటి కేసుల్లో ఎవరున్నా వదిలిపెట్టబోమని అన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. భార్గవ్రామ్ రెడ్డితో పాటు పరారీలో ఉన్న వాళ్లదరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఏవీ సుబ్బారెడ్డి డీల్ వెనుక ఉన్నదెవరు?: అఖిలప్రియ ఫ్యామిలీ
కిడ్నాప్ కేసులో కర్నూల్ లీడర్ ఏవీ సుబ్బారెడ్డిని ఏ1 గా చూపి తర్వాత ఏ2గా మార్చడం వెనుక పెద్దల డీల్ ఉన్నట్టు అఖిలప్రియ ఫ్యామిలీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పొలిటికల్ ప్రెషర్తోనే క్రిమినల్ హిస్టరీ ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అఖిలకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారమంతా హఫీజ్పేట ల్యాండ్స్ను సొంతం చేసుకునేందుకు.. కొందరు పెద్దలు చేసిన ప్లాన్గా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే క్రిమినల్ కేసుల పేరుతో భూమా ఫ్యామిలీపై పోలీస్ ఫోర్స్ను ప్రయోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కిడ్నాప్ జరిగిన రోజున మహబూబాబాద్ ఎంపీ కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇద్దరూ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లడం, స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతకంటే తీవ్రమైన ఎన్నో నేరాల్లో స్పందించని పోలీసులు.. ఈ కేసుకు ఎందుకింత ప్రయారిటీ ఇస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రవీణ్, సునీల్, నవీన్ ల కిడ్నాప్, రెస్క్యూ, కిడ్నాపర్ల పరారీ వెనుక బయటకు రాని వాస్తవాలేవో ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.