ఫోన్ ట్యాపింగ్ పై టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు : దేశంలో ఫస్ట్ తెలంగాణలోనే

ఫోన్ ట్యాపింగ్ పై టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు : దేశంలో ఫస్ట్ తెలంగాణలోనే

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్  జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో  దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో టెలిగ్రాఫ్ ఆక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.

ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధం. ఇది అన్ని సందర్భాల్లో కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రక్రియ, సరైన కారణాలు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీన్ని చేసేందుకు వీలు ఉంటుంది.  ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు.. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్... ఈ అవకాశాన్ని కల్పిస్తారు.   దేశ సార్వభౌమ‌త్వం, స‌మ‌గ్రత, శాంతి భ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ, విదేశాల‌తో స‌త్సంబంధాల నిర్వహ‌ణ‌తోపాటు ఏదైనా నేరాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కాల్స్‌ను ఇంట‌ర్‌సెప్ట్ చేయవచ్చు.  ఈ స‌మాచారాన్ని కావాలంటే ఏదైనా కంప్యూట‌ర్‌లో కూడా స్టోర్ చేస్తారు.

కేంద్రం పరిధిలో చూస్తే.. ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), రీసెర్చ్ ఏజెన్సీలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి.

 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ -1885  చట్టం ప్రకారం

సెక్షన్ - 5(2) ప్రకారం... దేశ సార్వభౌమ‌త్వం, స‌మ‌గ్రత, శాంతి భ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ, ప్రజాశ్రేయస్సు వంటి అంశాల్లో... రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే వీలు ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు చాలా  అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర హోంశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి పెద్ద ప్రక్రియే ఉంటుంది. ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం-2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలను చెబుతోంది. 

కాల్స్‌ను రికార్డు చేయ‌డానికి లేదా ఇంట‌ర్‌సెప్ట్ చేయ‌డానికి కేంద్ర ప్రభుత్వ విష‌యంలో కేంద్ర హోం శాఖ కార్యద‌ర్శి, రాష్ట్ర ప్రభుత్వం విష‌యంలో రాష్ట్ర హోం శాఖ కార్యద‌ర్శి అనుమ‌తి త‌ప్పనిస‌రి. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే అవకాశం ఉంది. ఇలా చేస్తే పౌరుడి గోప్యత హక్కును ఉల్లంఘించటం కిందకు వస్తుంది. ఇండియ‌న్ టెలిగ్రాఫ్ చ‌ట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు గ‌రిష్ఠంగా మూడేళ్ల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తారు. గతంలో పెగాసెస్ అనే ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భార‌త్‌లోని మాన‌వ హ‌క్కుల కార్యక‌ర్తలు, జ‌ర్నలిస్టుల‌పై నిఘా పెట్టార‌ని ఆరోప‌ణ‌లున్నాయి.