
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేకే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. పల్లవి ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి.. పోలీసుల ముందే ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారని తెలిపారు.
పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ న్యూసెన్స్ మొత్తం పోలీసుల కళ్లముందే జరిగిందన్నారు. భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత, భయము ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశామన్నారు పోలీసులు. సాక్షాదారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న కారణంగా పల్లవి ప్రశాంతను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
పోలీసులు పలుమార్లు పల్లవి ప్రశాంత్ కు విజ్ఞప్తి చేసినా కనికరించలేదని వెల్లడించారు. పల్లవి ప్రశాంత్ అతడి అనుచరులను రెచ్చగొట్టి కార్లు, బస్సులు ధ్వంసంకు పాల్పడ్డారని తెలిపారు. రెండు కార్లను రెంట్ కు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారని చెప్పారు. అక్కడికి వచ్చిన వారందరినీ విధ్వంసానికి ఉసిగొల్పి.. బిగ్ బాస్ షో కు వచ్చిన సెలబ్రిటీ కార్లను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.
మరో వైపు పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు.