వరంగల్ లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కన్నతండ్రే కాలయముడై చేసిన పక్కా ప్లాన్ అని పోలీసులు తేల్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తనకు మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో భార్యకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నం చేశాడు. అబార్షన్ కు ఒప్పుకోకపోవడంతో భార్య ఫర్హాత్, కూతుళ్లు ఆయేషా,ఉమెరాను స్విమ్మింగ్ పూల్లో ముంచి అతి క్రూరంగా హత్య చేశాడు. స్విమ్మింగ్ ఫూల్ లో ముంచి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు. మరో మైనర్ బాలికను వివాహం చేసుకునేందుకు.. అడ్డుగా ఉన్న భార్య, ఇద్దరు కూతుళ్లను తొలగించుకోవాలని అజారుద్దీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
అజారుద్దీన్ క్రూరత్వం అంతటితో ఆగలేదు. గతంలో స్కానింగ్లో ఆడపిల్ల అని తేలడంతో.. 2021లో ఒకసారి, 2022లో మరోసారి తన భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించినట్లు విచారణలో తేలింది. ఈ లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించిన కుటుంబ సభ్యులతో పాటు అక్రమంగా అబార్షన్లు చేసిన వైద్యురాళ్లపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్పై మామునూరు పోలీస్ స్టేషన్లో పోక్సో (POCSO) కేసు కూడా నమోదైంది. అబార్షన్లు చేసిన డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ రవళి ప్రస్తుతం పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
