
ఇంఫాల్ : కాంగ్రెస్ మాజీ చీఫ్రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మణిపూర్ లో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఇంఫాల్కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్లో రాహుల్ కాన్వాయ్ను పోలీసులు నిలిపివేశారు. అల్లర్లతో అట్టుడుకుతున్న చురాచాంద్పూర్ జిల్లాలో రాహుల్ పర్యటించాల్సి ఉండగా సెక్యూరిటీ సమస్యలు వస్తాయని, గ్రనేడ్ దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మార్గాన కాకుండా హెలికాప్టర్లో వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో రాహుల్ గాంధీ వెనుదిరిగి ఇంఫాల్కు వెళ్లి అక్కడనుంచి హెలికాప్టర్లో చురాచాంద్పూర్ చేరుకున్నారు.
రాహుల్ ప్రయాణించాలనుకున్న రోడ్డు మార్గంలో భారీ సంఖ్యలో మహిళలు ఆందోళన నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా కాన్వాయ్ను రిక్వెస్ట్ చేసి బిష్ణుపూర్లో నిలిపివేశామని పోలీస్అధికారి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్నేతలు మాట్లాడుతూ.. మహిళలు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారన్నారు. రాహుల్గాంధీ చురాచాంద్పూర్ జిల్లాలో అదేవిధంగా తమ గ్రామంలో పర్యటించాలని ఆందోళనకారులు కోరుకున్నారన్నారు. కాగా, మణిపూర్ బ్రదర్స్, సిస్టర్స్ ను కలవకుండా బీజేపీ ప్రభుత్వం తనను అడ్డుకుందని రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హింసాత్మక ఘటనలతో సతమతమవుతున్న రాష్ర్ట ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నారు.
మణిపూర్లో మళ్లీ కాల్పులు
మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. గురువారం సాయుధ దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కంపోక్పీ జిల్లా హరావ్థెల్గ్రామంలో కొంతమంది కాల్పులు జరిపారని ఇండియన్ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు సైనిక బలగాలను ఆ ప్రాంతానికి తరలించామని తెలిపారు. గురువారం ఉదయం 5.30 సమయంలో ఆయుధాలతో వచ్చిన కొంతమంది గ్రామంపై కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందిందన్నారు. ఈ ఏడాది మే నుంచి గిరిజన కమ్యూనిటీల మధ్య జరుగుతున్న హింసాత్మక దాడుల్లో మణిపూర్అతలాకుతలం అవుతోంది. ఈనేపథ్యంలో రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 300 రిలీఫ్ క్యాంపుల్లో సుమారు 50వేలమంది ఆశ్రయం పొందుతున్నారు. ఘర్షణల్లో ఇప్పటివరకు 100మందికి పైగా మృతిచెందారు.