నాగర్కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో పొలిటికల్ హీట్ అప్పుడే పీక్ స్టేజీకి చేరింది. నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల పోస్టులు దాటి ఫ్లెక్సీలు చింపే వరకు వెళ్లిపోయారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు తమ లీడర్కు నష్టం జరుగుతుందని భావిస్తే దాడులు చేసేందుకూ వెకకాడడం లేదు. అపోజిషన్ నేతలే కాదు.. సొంత పార్టీలోని మరో వర్గం బ్యానర్లు ఏర్పాటు చేసినా రాత్రికి రాత్రే చించివేయడం, కాల్చివేయడం చేస్తున్నారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సందర్భంగా మొదలైన ఈ పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఎస్సీ, ఎస్టీ ఆత్మగౌరవ సభతో మొదలు..
జనవరి 7న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బిజినేపల్లి మండలంలోని మార్కండేయ లిఫ్ట్ సందర్శనకు వెళ్లగా.. బీఆర్ఎస్ నేతలు దళిత, గిరిజన నేతలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా చర్యలు తీసుకోలేదు.. పైగా కాంగ్రెస్ నేతలపైనే రివర్స్ కేసు పెట్టారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి 22న బిజినేపల్లి మండల కేంద్రంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా రాగా.. ఒకరోజు ముందుగానే స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో బిజినేపల్లి, నాగర్ కర్నూల్ రూట్లలో ఏర్పాటు చేసిన ఐదు ఫ్లెక్సీలను చింపేశారు. ఒక దాన్ని పూర్తిగా కాల్చేశారు. ఇది ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వర్గీయుల పనేనని , విచారణ చేపట్టిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సామూహిక వివాహాల సందర్భంగా..
ఫిబ్రవరి12న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన ట్రస్ట్(ఎంజేఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు చింపేశారు. దీనిపై బీఆర్ఎస్ లీడర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఫ్లెక్సీలు చింపివేసినందుకు ప్రతీకారంగానే సామూహిక వివాహాల బ్యానర్లు చింపినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనలపై ఇరు పార్టీల నేతలు ‘అభివృద్ధిని ఓరుస్తలేరని ఒకరు.. నియోజకర్గానికి చేసిందేమీ లేదని మరొకరు’ దమ్మెత్తిపోసుకుంటున్నారు.
లింగాల మండలంలో..
అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ ఈనెల 15న మంగళవారం రాత్రి శివస్వాములకు అన్నదానాన్ని ఏర్పాటు చేశాడు. దీనిపై గురుస్వామి బొడ్రాయి కూడలిలో ఫ్లెక్సీ పెట్టించాడు. అయితే ఇందులో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సర్పంచ్ కోనేటి తిరుపతయ్యతో పాటు శ్రీనివాస్ రాథోడ్ ఫొటో కూడా పెట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో శ్రీనివాస్ ఫోటోను తొలగించాలని కోరారు. స్వాములు తొలగించకపోవడంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ ఫోటోను చించివేశారు. గమనించిన బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని దాడి చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలపై పీఎస్లో కేసు పెట్టారు.
ఎంపీ రాములు ఫ్లెక్సీ సైతం..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అచ్చంపేట బస్టాండ్ సమీపంలో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ రాములు, ఆయన తనయుడు భరత్ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. ఇది అధికార పార్టీలోనే మరోవర్గం పనేనని ప్రచారం జరుగుతోంది. జడ్పీ చైర్పర్సన్ పదవి భరత్ ప్రసాద్కు దక్కుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. ఇప్పటికే జడ్పీటీసీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించి కలెక్టర్కు లెటర్ ఇచ్చిన ఆయన నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తన ఇమేజీని పెంచుకుంటున్నారు. ఈ కారణంలోనే ఎమ్మెల్యే వర్గీయులే హోర్టింగ్కు ఉన్న ఫ్లెక్సీని చించి వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.