భగీరథ నీళ్లతో దద్దుర్లు

భగీరథ నీళ్లతో దద్దుర్లు

    రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

    మూడు నెలలుగా హాస్పిటళ్ల చుట్టు తిరుగుతున్నరు

    కలుషిత నీరే

    కారణమంటున్న డాక్టర్లు

టీఆర్​ఎస్​ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరధ పథకాన్ని తీసుకువచ్చింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని నాయకపల్లి, బాల్యనాయక్ తండాలో మాత్రం మిషన్​భగీరథ నీటితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గూడూరు మండలంలోని 39 గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు నల్లాల ద్వారా అందిస్తున్నారు. చాలా గ్రామాల్లో నీటి సరఫరాకు ప్రత్యేకంగా పైపులైన్ వేశారు. కొన్ని గ్రామాల్లో మాత్రం పాత పైపులైన్ల ద్వారానే భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. నాయకపల్లి గ్రామంలో ఆరు నెలలుగా నల్లా పైపుల ద్వారా  నీరందుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి గ్రామస్తులకు కొద్దికొద్దిగా దురదలు మొదలయ్యాయి. వాతావరణంలో మార్పులు, ఇంకేదైన కారణాలు కావచ్చని మొదట్లో లైట్ గా తీసుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్ది నాయకపల్లి, బాల్యనాయక్ తండాతో పాటు సమీప గ్రామాల ప్రజల్లో చాలామందికి దురదలు మొదలయ్యాయి. గ్రామంలో సగానికి పైగా ప్రజలకు దురదతో ఒళ్లంతా దద్దుర్లు వచ్చి నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. మూడు నెలలుగా దవాఖానల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. దురదలతో రాత్రిపూట కనీసం నిద్రపోలేకపోతున్నామని వాపోతున్నారు. గ్రామంలోని చంద్రమ్మ అనే వృద్ధురాలికి మత్తు టాబ్లెట్ లు ఇచ్చి పడుకోబెడుతున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ఒకదశలో వాటర్ సప్లై చేసేవారికి భగీరథ వాటర్ బంద్ చేయాలని చెప్పినా వినలేదని నాయకపల్లి, బాల్యనాయక్ తండా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్లా నీళ్లు బంద్ చేయమన్నం

మూడు నెలలుగా దురదతో ఇబ్బంది పడుతున్నా. మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట చాలాచోట్ల డాక్టర్లకు చూపిం చినా తగ్గడం లేదు. నీళ్లు మార్చుకోమని డాక్టర్లు చెబుతున్నరు. నల్లా వేసే అతనితో మిషన్​ భగీరథ వాటర్ సప్లై బంద్ చేయాలని చెప్పినా వినడం లేదు.

‑ బానోత్​తోలే, బాల్యతండా

రూ. 50 వేలు ఖర్చయినయ్

మిషన్ భగీరథ వాటర్ వల్లే దురద వచ్చినట్టు డాక్టర్లు చెప్పారు. దురద ఉన్నచోట రోజు గోకడంతో రక్తం కారి ఒళ్లంతా నల్లటి మచ్చలు పడినయ్. ఇప్పటికి నాలుగు నెలలుగా నరకయాతన పడుతున్న. రూ. 50 వేల వరకు ఖర్చయినయ్. ఇప్పటికి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు బావి నీరు తెచ్చుకుని వాడుతున్నాం.

– సరోజన, నాయకపల్లి

పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటాం

రాష్ట్రవ్యాప్తంగా పాలేరు నుంచి అన్ని మండలాలకు మిషన్ భగీరథ నీరు సప్లై చేస్తున్నాం. నాయకపల్లి, బాల్యనాయక్ తండాలో మాత్రమే భగీరథ వాటర్​తో దద్దుర్లు వచ్చే అవకాశం ఉండదు. అలాంటిది ఏదైనా ఉంటే నీటిని పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రజలు వాడుతున్న లోకల్ బావులు, బోర్లను కూడా పరిశీలిస్తాం.

‑ సూర్య, మిషన్​ భగీరథ డీఈ

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి