గుడిసెలు వేసుడు.. ఆఫీసర్లు కూల్చుడు

గుడిసెలు వేసుడు.. ఆఫీసర్లు కూల్చుడు
  • గుడిసెలు వేసుడు.. ఆఫీసర్లు కూల్చుడు
  • మానుకోటలో గుడిసెలు తొలగించడంతో మళ్లీ ఉద్రిక్తత
  • పోలీసుల తీరుకు నిరసనగా పెట్రోల్​ చల్లుకున్న యువకుడు
  • పేదలను అరెస్టు చేసిన పోలీసులు

మహబూబాబాదాద్​, వెలుగు:  మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని  న్యూ కలెక్టరేట్​ వద్ద  ప్రభుత్వ భూమిలో  పేదల గుడిసెల పోరాటం బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నెం. 255/1 లో 30 ఎకరాల పరిధిలో  పేదలు వేసుకున్న గుడిసెలను ఇటీవల తొలగించడంతో  వాటి స్థానంలో మళ్లీ కొంతమంది మంగళవారం రాత్రి గుడిసెలు వేసుకున్నారు.  విషయం తెలిసిన రెవెన్యూ, పోలీస్​, మున్సిపల్​ ఆఫీసర్లు తెల్లవారుజామున అక్కడికి చేరుకుని  సదరు గుడిసెలను తొలగించడంతో పాటు, పేదలను అక్కడి నుంచి బయటకు పంపిస్తుండగా తోపులాట జరిగింది. మహబూబాబాద్​ రూరల్​ సీఐ రమేశ్​ ఆధ్వర్యంలో  భారీగా వచ్చిన పోలీస్​ బలగాలను పేదలు  తీవ్రంగా ప్రతిఘటించారు.  

తూము వేణు అనే యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ బాటిల్​ తీసి మీద చల్లుకోగా పోలీసులు అడ్డుకుని  అదుపులోకి తీసుకున్నారు.  మున్సిపల్​ సిబ్బంది గుడిసెలను తొలగిస్తుండగా  జిన్న నర్సమ్మ అనే మహిళ  కాలుకు గాయమైంది.  మట్టాల సురేశ్​ చేతికి దెబ్బతగిలింది.  గాయపడ్డవారిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.  పలువురిని డీసీఎంలలో స్టేషన్​కు తరలించారు.  తర్వాత సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్​ తహసీల్దార్​ ఇమ్మానియేల్​ హెచ్చరించారు.  

ప్రతీ సారి ఇదే..

కలెక్టరేట్​ పక్కనే ఉన్న ప్రభుత్వ జాగలో  సీపీఎం ఆధ్వర్యంలో దాదాపు 800 మంది పేదలు  మూడు నెలల నుంచి ఐదు సార్లు గుడిసెలు వేసుకున్నారు.  ప్రతీసారి వాటిని ఆఫీసర్లు  ఎక్స్​కవేటర్లు, డోజర్లతో నేలమట్టం చేశారు.  గూడు కోసం వేసుకున్న తమ గుడిసెలను తరచుగా తొలగిస్తున్నారని  ఆఫీసర్లు, ప్రభుత్వంపై  పేదలు మండిపడ్తున్నారు.