వాటికన్ సిటీ: పశ్చిమాసియాలో జరుగుతున్న రక్తపాతాన్ని వెంటనే ఆపాలని, తక్షణమే యుద్ధవిరమణ ప్రకటించాలని పోప్ లియో–14 ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆదివారం వాటికన్ సిటీలో జరిగిన ప్రార్థనల అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘పశ్చిమాసియాలోని క్రైస్తవుల తరపున, శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరి తరపున నేను ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తక్షణమే రక్తపాతాన్ని ఆపాలి. చర్చలకు మార్గం సుగమం చేయాలి.
హింస ద్వారా ఎన్నటికీ న్యాయం, శాంతి లభించవు”అని స్పష్టం చేశారు. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఒక ప్రాథమిక పాఠశాలలోని 165మందికిపైగా చిన్నారులు మరణించిన ఘటనను పోప్ పరోక్షంగా ప్రస్తావించారు. స్కూల్స్, ఆస్పత్రులు, నివాస ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
లియో–-14 అమెరికాకు చెందిన మొదటి పోప్. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రాజకీయ ప్రత్యర్థిగా కనిపించకుండా ఉండేందుకు గత రెండు వారాలుగా దౌత్యపరమైన సంయమనం పాటిస్తున్నారు. అయితే, పెరుగుతున్న ప్రాణనష్టం దృష్ట్యా ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు.
