పవన్ కాపులను తిట్టడం వెనుక చంద్రబాబు స్కెచ్ : పోసాని కృష్ణ మురళి

పవన్ కాపులను తిట్టడం వెనుక చంద్రబాబు స్కెచ్ :  పోసాని కృష్ణ మురళి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓరేంజ్‌లోఫైర్‌ అయ్యారుఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి. వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ కామెంట్లపై ఘాటుగా స్పందించారు. పవన్ మంచివాడే కాని చంద్రబాబు మాయలో ఎందుకు పడ్డాడో అర్దం కావడం లేదన్నారు. చంద్రబాబు స్కెచ్ వల్లే... పవన్ కళ్యాణ్ కాపుల మధ్య నిలబడి కాపులనే తిడుతున్నారని అర్దమవుతుందన్నారు. తాను కాపు కాకపోయినా.. ముద్రగడ లాంటి వారిని గౌరవిస్తానన్నారు పోసాని. కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారంటూ... కాపులకు అన్యాయం జరుగుతుందని.. తన మంత్రి పదవికి ముద్రగడ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు.  ముద్రగడ గొప్పవాడా.. పవన్ కల్యాణ్‌ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడో కాపు సోదరులు గ్రహించాలని సూచించారు.  కాపులలో ఒకరు ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటున్నా.. పవన్ లాంటి వాళ్ల వల్ల నష్టపోతున్నారన్న ఆయన.. ముద్రగడ  అవినీతి చేశాడని నిరూపిస్తే ...తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానంటూ సవాల్‌ పోసాని సవాల్ చేశారు.

జగన్ ను తిట్టడం పవన్ కు అలవాటుగా మారింది...

రాజకీయాల్లో వ్యక్తి గత ద్వేషం పనికిరాదన్న ఆయన.. జగన్ ఏం పనిచేసినా పవన్ కు తిట్టడం అలవాటు అయ్యింది. నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసి  ఒకే టర్మ్ లో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ తప్ప మరోవ్యక్తి లేరని ప్రశంసలు కురిపించారు.  జగన్ ను తిట్టి.. చంద్రబాబును పవన్  పొగడటం వల్ల తాను కూడా రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు పోసాని మురళీకృష్ణ.  పవన్ కల్యాణ్‌ కు దమ్ముంటే సీఎం జగన్ అవినీతిని నిరూపించాలని సవాల్‌ చేశారు.. కర్ణుడు గొప్పవాడు.. అయినా దుర్మార్గుల పక్కన నిలబడి నాశనం అయ్యాడు.. ఇప్పుడు పవన్ అదే చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు పోసాని కృష్ణ మురళి.

చంద్రబాబు మాయలో పవన్

పవన్ ఎవరి కోసం పనిచేస్తున్నారో ఇప్పటికైనా కాపులు అర్థం చేసుకోవాలని సూచించారు పోసాని.. జగన్, ముద్రగడ కంటే చంద్రబాబు ఉత్తముడని చంద్రబాబుకు పవన్ సపోర్ట్ చేస్తున్నారా? అని ప్రశ్నించిన ఆయన...పవన్ ఒకప్పుడు చాలా మంచి వాడు. ఇప్పుడు చంద్రబాబు మాయలో ఎందుకు పడ్డాడో అర్థం కావడంలేదన్నారు.  చంద్రబాబు తన కమ్మ వాళ్లను ఒక్క మాట అనడు.. కానీ, పవన్‌ కల్యాణ్‌ మాత్రం కాపులనే తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కమ్మ అయినా..  కాపులు అంటే ఇష్టమని పోసాని మురళి అన్నారు. అలాంటిది కాపు అయిన పవన్ మరో కాపును తిట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ను గత ఎన్నికల ముందు తిట్టిన ఇదే పవన్.. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు.. కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాల్సిన పవన్.. కమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.


చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పవన్ కల్యాణ్‌ అనుకోవడాన్ని తాను తప్పపట్టడం లేదని పోసాని అన్నారు.  కానీ వంగవీటి మోహన్ రంగా లాంటి వారిని చంద్రబాబు చంపించారు.  ఈ విషయాన్ని  అంత ఈజీగా మర్చిపోతారా..? అని ప్రశ్నించారు పోసాని.. నేను ఓడినా పర్వాలేదు.. కానీ, చంద్రబాబుతో కలవను అని చిరంజీవి అన్నారు.. ఇది చిరంజీవి నిజాయితీ. చిరంజీవి ఓడిపోవాలని కమ్మ కులస్తుల ఓట్లు ప్రజారాజ్యంకు వేయొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు.. ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో తెలియని పవన్.. కాపులను తిట్టడం వెనక ఉన్న ఎజెండా ఏంటి? అంటూ నిలదీశారు.