- త్వరలో గ్రూప్-3 అభ్యర్థులకు పోస్టింగ్స్: చిన్నారెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 367 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 144, రెవెన్యూ శాఖకు సంబంధించి 23, ఇందిరమ్మ ఇండ్ల కోసం 83, మున్సిపల్ శాఖకు 18, పౌర సరఫరాల శాఖకు 30 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 69 అప్లికేషన్లు అందాయని అధికారులు తెలిపారు.
సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున గ్రూప్-3 అభ్యర్థులు తరలి వచ్చారు. తమకు పోస్టింగ్స్ త్వరగా ఇప్పించాలని కోరారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎంపికైన 1, 388 మంది గ్రూప్ -3 అభ్యర్థులకు త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని తెలిపారు.
