మీటర్లు గిర్రగిర్రా! ఫిబ్రవరి నుంచే పెరుగుతున్న పవర్ డిమాండ్

మీటర్లు గిర్రగిర్రా! ఫిబ్రవరి నుంచే పెరుగుతున్న పవర్ డిమాండ్
  • రోజుకు సగటున 16,500 మెగావాట్లకు పైగా వినియోగం 
  • మార్చిలో 18 వేల మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా 
  • గృహ, వ్యవసాయ వినియోగం పెరగడమే కారణం 
  • ఈసారి 70 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు
  • నిరుటి కంటే 9 శాతం అధికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పవర్​ డిమాండ్​ రోజురోజుకూ పెరుగుతున్నది. ఎండలు ఇంకా ముదరకముందే ఫిబ్రవరిలోనే కరెంట్ ​మీటర్లు గిర్ర గిర్రా తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 16,500 మెగావాట్ల డిమాండ్​ ఉండగా, మార్చిలోనే ఇది 18 వేల మెగావాట్లకు చేరుకోవచ్చని విద్యుత్ శాఖ ఇంజనీర్లు అంటున్నారు. డొమెస్టిక్, కమర్షియల్ అవసరాలతో పాటు అగ్రికల్చర్​ వినియోగం పెరగడం ఇందుకు కారణం. ఈ సారి యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.

గత యాసంగితో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ. మరీ ముఖ్యంగా ఎస్సారెస్పీతో పాటు బ్యారేజీలు, చెరువులు, బోర్లు, బావుల కింద సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ప్రాజెక్టుల కింద ఆరుతడికి మాత్రమే సాగునీరు ఇస్తుండడంతో ఆయకట్టు ప్రాంతాల్లోనూ రైతులు కరెంట్ మోటార్లు వినియోగిస్తున్నారు. దీంతో ఈ యాసంగి సీజన్​లో పీక్ డిమాండ్ 19 వేల మెగావాట్లు దాటవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఫిబ్రవరిలోనే పెరుగుతున్న పవర్ డిమాండ్ 
2024లో ఫిబ్రవరి 19న 14,831 మెగావాట్ల కరెంట్​ వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి.  గతేడాది ఫిబ్రవరిలో ఇది 16 వేల మెగావాట్లకు చేరగా, ఈ సారి అంతకుమించి రెండు రోజులుగా16,818 మెగావాట్ల మేర వినియోగం జరుగుతున్నది. అంటే రెండేండ్లలోనే సుమారు 2 వేల మెగావాట్ల వినియోగం పెరిగింది. నిరుడు మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ రికార్డ్ నమోదు కాగా, ఈ ఏడాది ఈ రికార్డు బ్రేక్​ చేసే అవకాశం ఉందని విద్యుత్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండస్ట్రియల్ గ్రోత్, అర్బనైజేషన్, ఎకనామిక్ ఎక్స్పాన్షన్ వల్ల పవర్​ డిమాండ్ ఏటేటా పెరుగుతున్నదని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని అవసరాలకు 301 మిలియన్​ యూనిట్ల కరెంట్​అవసరం అవుతుండగా, జెన్​కో నుంచి 98.24, సింగరేణి నుంచి11.94 మిలియన్​ యూనిట్లు మాత్రమే అందుతున్నది. దీంతో బయటి నుంచి 131.16 మిలియన్​ యూనిట్లు కొనుగోలు చేసి నిరంతరాయంగా విద్యుత్​ సరఫరా చేస్తున్నారు. 

పెరిగిన గృహ, కమర్షియల్ వినియోగం
చలి తగ్గడంతో కొద్ది రోజులుగా పగటి పూట ఉక్కపోత మొదలైంది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ఇండ్లల్లోనూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే కరెంట్​ వినియోగం 10 నుంచి 13 శాతం పెరిగిందని విద్యుత్​ అధికారులు చెబుతున్నారు. 

సాధారణంగా మార్చి నుంచి జూన్​ మొదటి వారం వరకు హీట్​ వేవ్స్​ ఉంటాయి. అప్పుడు పవర్​ డిమాండ్​ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈలెక్కన మే నెలలో డిమాండ్​దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విద్యుత్​శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.