
- ఎస్ఐబీ చీఫ్గా నా డ్యూటీ మాత్రమే చేసిన
- సిట్ విచారణలో ప్రభాకర్రావు వెల్లడి
- చాలా ప్రశ్నలకు ‘తెలియదు.. గుర్తులేదు’ అంటూ జవాబు
- ఎస్ఐబీ డేటా ధ్వంసం రివ్యూ కమిటీ పరిధిలోని అంశం
- తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపాలని ఎదురు ప్రశ్న
- 8 గంటలు కొనసాగిన విచారణ.. రేపు మళ్లీ రావాలని సిట్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే.. అదంతా ఉన్నతాధికారులకు తెలుసని ఆయన చెప్పారు. తాను ఎస్ఐబీ చీఫ్గా తన డ్యూటీ మాత్రమే చేశానని తెలిపారు. ఎస్ఐబీ ఆఫీస్, హార్డ్డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నించగా.. అదంతా రివ్యూ కమిటీ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపాలని సిట్ అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభాకర్ రావు వాట్సాప్కు వచ్చిన కొన్ని ఫోన్ నెంబర్లు, అందులోని అంశాలను అధికారులు చూపగా.. ‘గుర్తులేదు.. మర్చిపోయాను’ అని సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం.
క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో విదేశాల్లో ఉంటున్న ప్రభాకర్ రావు.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సిట్ అధికారులకు చూపలేదు. మరోవైపు తనపై కేసు నమోదయ్యే ముందు పలువురు పోలీస్ అధికారులతో ప్రభాకర్ రావు ఫోన్లు మాట్లాడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే విషయమై ప్రశ్నించగా, ఆ అధికారుల వివరాలను ఆయన వెల్లడించలేదు.
రివ్యూ కమిటీని ఇరికించే ప్రయత్నం!
సిట్ అధికారుల విచారణలో ప్రభాకర్రావు తన పోలీస్ తెలివి ప్రదర్శించినట్టు తెలిసింది. సంఘ విద్రోహశక్తులు మినహా రాజకీయ నాయకులు, సామాన్యుల ఫోన్లు ట్యాప్ చేయడం నేరం కాదా? అని సిట్ ప్రశ్నించగా.. నిబంధనల మేరకే ఎస్ఐబీ పని చేసిందని ప్రభాకర్ రావు చెప్పినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గత ప్రభుత్వ హయాంలో పని చేసిన రివ్యూ కమిటీకి ఆపాదించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. మావోయిస్టులు, టెర్రరిస్టులు సహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ల ఫోన్లను ట్యాప్ చేయడమనేది ప్రతి ప్రభుత్వంలోనూ సాధారణంగా జరిగే విషయమని గుర్తుంచుకోవాలని సిట్ అధికారులకు సూచించినట్టు తెలిసింది.
‘‘ఫోన్ ట్యాపింగ్ డేటాను ఉంచాలా? లేదా డిలీట్ చేయాలా? అనేది రివ్యూ కమిటీ నిర్ణయిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ సమీక్ష జరుగుతుంది. అందులో నేను సభ్యుడిని కాదు. ఫోన్ ట్యాపింగ్ అంశాలపై చర్చించి కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు” అని ప్రభాకర్ రావు వివరించినట్టు సమాచారం.
రాజీనామా చేశాక నేనెట్ల బాధ్యుణ్ని అవుతా?
ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ల ధ్వంసంపైనా ప్రభాకర్రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ‘‘హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని మీరు ఆదేశించినట్టు ప్రణీత్రావు చెప్పారు. హార్డ్డిస్క్ల ధ్వంసం వల్ల గత 30 ఏండ్లుగా సేకరించిన మావోయిస్టులు, టెర్రిరిస్టులు సహా ఇతర సంఘ విద్రోహక శక్తుల డేటా పూర్తిగా కోల్పోయాం. దీనికి మీరు బాధ్యులు కాదా?” సిట్ అధికారులు ప్రశ్నించారు. దీనికి ప్రభాకర్ రావు సమాధానమిస్తూ.. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని తాను ఆదేశించినట్టు ఆధారాలు ఉంటే చూపించాలని కోరినట్టు తెలిసింది.
అది రివ్యూ కమిటీ పరిధిలోని అంశమని వెల్లడించినట్టు సమాచారం. ‘‘అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 2023 డిసెంబర్ 4న సాయంత్రం 4 గంటలకు నేను ఎస్ఐబీ చీఫ్ పదవికి రాజీనామా చేశాను. ఆ తరువాత జరిగిన ఘటనలకు నన్ను ఎలా బాధ్యుణ్ని చేస్తారు. రాజీనామా అనంతరం నా ఆదేశాలను ఎస్ఐబీ సిబ్బంది ఎందుకు పాటిస్తారు” అని ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది.
మళ్లీ రావాలని నోటీసులు..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్రావు.. సోమవారం ఉదయం 11:30 గంటలకు సిట్ ముందు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసులో వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది. విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేశారు. రాత్రి 7 గంటల వరకు దాదాపు 8గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రభాకర్రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
బుధవారం ఉదయం మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. గత అసెంబ్లీ ఎన్నికలు, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు సెల్ఫోన్లను తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఐఎంఈఐ నంబర్లను కూడా ప్రభాకర్ రావుకు అందించారు. ల్యాప్టాప్, మ్యాక్బుక్ కూడా తీసుకురావాలని చెప్పారు.
స్పెషల్ ఆపరేషన్స్ వెనుక ఉద్దేశమేంటి?
మావోయిస్టులు, టెర్రిరిస్టుల కదలికలు గుర్తించేందుకు కాకుండా నాటి బీఆర్ఎస్ సర్కార్కు అనుకూలంగా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ప్రతిపక్ష నేతలు, హైకోర్టు జడ్జీలు, వ్యాపార వేత్తలు, సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ (ఎస్వోటీ) ఏర్పాటు చేశారని, అసలు దీని ఉద్దేశం ఏమిటనే వివరాలను ప్రభాకర్ రావు ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రిటైర్ అయిన ప్రభాకర్ రావుకు ఓఎస్డీగా, ఎస్ఐబీ చీఫ్గా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆనాటి సీఎం కేసీఆర్, సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్ రావు కేంద్ర బిందువు కావడంతో ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు వినియోగించిన సెల్ఫోన్లనుసీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ద్వారా డేటా రిట్రీవ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.