
నగరంలో దారుణం జరిగింది. నిండు గర్భిణి అనే కనికరం కూడా లేకుండా ఓ దుర్మార్గుడు అతి కిరాతకంగా ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఈ అమానుష ఘటన మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం వెంకట్ అనే వ్యక్తి.. పద్మ(30) అనే మహిళను తన భార్యగా పేర్కొంటూ స్థానిక శ్రీనివాస నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
అయితే రెండు రోజుల నుంచి సదరు వ్యక్తి కనిపించకపోవడం, అతను అద్దెకు తీసుకున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఆ ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటికెళ్లి చూడగా గర్భిణి మృతదేహం కనిపించింది. దీంతో యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. యజమాని ఫిర్యాదు మేరకు బాలానగర్ ఏసీపీ గోవర్థన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం తీరును బట్టి మూడు రోజుల క్రితమే యువతిని గొంతుకోసి హత్యచేసినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.