జేసీబీల్లో వాగులు దాటిన గర్భిణులు

జేసీబీల్లో వాగులు దాటిన గర్భిణులు

నిజామాబాద్/జగిత్యాల, వెలుగు: వర్షాలతో గర్భిణులు అవస్థలు పడ్డారు. చెరువులు తెగడం, వాగులు పొంగి ప్రవహించడంతో దవాఖానలకు పోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. నిజామాబాద్ ​జిల్లా భీమ్​గల్​ మండలంలోని పిప్రీ గ్రామానికి చెందిన నిండు గర్భిణి అనితకు గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. పిప్రీ-–బాచన్​పల్లిల మధ్య చెరువుకట్ట తెగిపోవడంతో రోడ్డుపైకి నీళ్లొచ్చి రాకపోకలు నిలిచిపోయాయి. 

ఆమె భర్త అజయ్, ​మరో ఇద్దరు కుటుంబసభ్యుల సాయంతో జేసీబీని తెప్పించి అందులో 4 కిలోమీటర్ల దూరంలోని బాచన్​పల్లి దాకా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి 108లో ఆర్మూర్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అలాగే జగిత్యాల జిల్లా భీమారం మండలం రాజలింగం పేట్​కు చెందిన దేశవేని లతకు పురిటినొప్పులు వచ్చాయి. శివారులోని వాగు పొంగడంతో సర్పంచ్ చారి జేసీబీ తెప్పించారు. 

ALSO READ:వానలపై.. పోలీసుల ఫోకస్

ఆమెను ముందు నిల్చోబెట్టి వాగు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్సులో కోరుట్ల తీసుకువెళ్లారు.  గన్నేరువరానికి చెందిన వేముల సుప్రియ​కు నొప్పులు రాగా అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గన్నేరువరం చెరువు వద్ద కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహించడంతో ఆంబులెన్స్​ దాటలేక తిరిగి వెళ్లిపోయింది. చివరకు పోలీసుల సాయంతో వారి వెహికల్ లో సిద్దిపేట జిల్లా తోటపల్లి మీదుగా  కరీంనగర్ హాస్పిటల్​కు వెళ్లారు.