- వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో గర్భిణుల అవస్థలు
- కరోనా పేషెంట్స్ మధ్యే ట్రీట్మెంట్
- గంటల తరబడి క్యూలోనే…
హైదరాబాద్, వెలుగు: ట్రీట్మెంట్ కోసం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి వస్తున్న గర్భిణులు కనీస సౌలత్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఈ దవాఖానకు వనస్థలిపురంతోపాటు ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం నుంచి గర్భిణులు, ఇతర రోగులు వస్తుంటారు. డైలీ వెయ్యి నుంచి 1,500 ఓపీ ఉంటుంది. గర్భిణులు మంగళ, గురువారాల్లో చెకప్కి వస్తుంటారు. తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు. సరిపడా కుర్చీలు లేకపోవడంతో నిలబడాలంటే అవస్థ పడుతున్నారు. వందల మంది వస్తున్నా అధికారులు కరోనా టైమ్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు కూడా చేయలేదు. దాంతో భయంభయంగానే ట్రీట్మెంట్చేయించుకుని వెళ్తున్నారు.
పక్కనే కరోనా టెస్టులు
ఈ హాస్పిటల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. ఐసొలేషన్ సెంటర్ కూడా ఉంది. గర్భిణులు, కరోనా సస్పెక్టర్స్ ఓపీ ఒకే హాల్లో ఉండడంతో రద్దీ ఏర్పడుతోంది. క్యూలో ఉన్న గర్భిణులను దాటుకునే కరోనా టెస్టుల కోసం వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ డైలీ 40దాకా పాజిటివ్ కేసులువస్తుండడంతో గర్భిణులు, ఇతర రోగులు భయపడుతున్నారు. అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఏం పట్టించుకుంటలేరు
మా పక్కనే కరోనా ఓపీ చూస్తున్నరు. దాంతో ఎవరికి పాజిటివ్ ఉందో తెలియక టెన్షన్పడుతున్నం. కుర్చీల్లేక గర్భిణులం గంటల తరబడి నిలబడి ఉంటున్నం. ఫిజికల్ డిస్టెన్స్పాటించే పరిస్థితి కూడా లేదు. పట్టించుకునే వాళ్లే లేరు.
‑ ప్రియాంక, గర్భిణి
కుర్చీల కోసం ఇండెంట్ పెట్టాం
హాస్పిటల్కి గర్భిణులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉన్న కుర్చీలు సరిపోవడం లేదు. మరిన్ని కావాలని అధికారులకు రిక్వెస్ట్ పెట్టాం. ప్రతి ఒక్కరూ కరోనా గైడ్లైన్స్ పాటించాలని అవేర్నెస్ కల్పిస్తున్నాం. గర్భిణులు ఏ రోజు వచ్చినా చెకప్ చేస్తాం. ఒకే రోజు రావాలనేం లేదు.
‑ హరిప్రియ, హాస్పిటల్ సూపరింటెండెంట్