గర్భిణులు హెచ్‌‌పీసీఎల్ పరీక్షలు చేయించుకోవాలి: డీఎంహెచ్‌‌వో పుట్ల శ్రీనివాస్

గర్భిణులు హెచ్‌‌పీసీఎల్ పరీక్షలు చేయించుకోవాలి: డీఎంహెచ్‌‌వో పుట్ల శ్రీనివాస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గర్భం ధరించిన12 వారాల్లోపు హెచ్‌‌పీసీఎల్ పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌‌వో పుట్ల శ్రీనివాస్ సూచించారు. డీఎంహెచ్​వో ఆఫీసు వద్ద ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో 12 వారాల్లోపు గర్భిణీలకు 17,898 హెచ్‌‌పీసీఎల్ పరీక్షలు చేయగా.. 15 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందన్నారు.

సికిల్ సెల్ అనీమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధిత వ్యాధి అని అన్నారు. ఇందులో ఎర్ర రక్త కణాలు ఆకారం మార్చుకుని ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయన్నారు. వివాహానికి ముందు, గర్భధారణ సమయంలో స్క్రీనింగ్ పరీక్షలతో పాటు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలన్నారు. 200 మంది ర్యాలీలో పాల్గొన్నారు.

వ్యాధి నిరోధక టీకాల ఆఫీసర్​డాక్టర్ శ్రీధర్, అడిషనల్​డీఎంహెచ్​వో డాక్టర్ అనిత, సికిల్ సెల్ నోడల్ ఆఫీసర్​డాక్టర్ సాయిబాబా, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీకళ, జిల్లా మాస్ మీడియా ఆఫీసర్​జక్కుల రాములు పాల్గొన్నారు.