- టెస్ట్లు.. బార్ కోడింగ్కు గర్భిణుల బాధలు
- గంటల కొద్దీ క్యూలో నిల్చుని వెయింటింగ్
- కూర్చోడానికి కుర్చీలు లేక ఇబ్బందులు
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దుస్థితి
ఎల్బీ నగర్,వెలుగు: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు రెగ్యులర్ టెస్ట్లకు తెల్లారుజామున వచ్చి క్యూ లైన్ లో గంటల కొద్దీ నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆస్పత్రికి ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం సెగ్మెంట్ల పరిధిలోని ప్రాంతాల నుంచి గర్భిణులు ఎక్కువగా వస్తుంటారు. వీరికి సోమ, బుధవారాల్లో మాత్రమే ప్రత్యేకంగా చెకప్లు చేస్తారు. ఆయా రోజుల్లో వందల మంది గర్భిణులు ఉదయాన్నే వచ్చి వెయిట్ చేస్తుంటారు. డాక్టర్ల వద్ద చెకప్తర్వాత టెస్ట్లు చేయించుకోవాలం టే గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొవాల్సిందే. బార్ కోడింగ్ ఉంటేనే టెస్ట్ లు చేస్తారు. లేదంటే చేయరు. దీని కోసమూ గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిందే. గర్భిణులు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు. అధికారులు పట్టించుకోకపోవడంతో గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం టెస్ట్ల కోసం వచ్చిన వారు పొద్దటి నుంచి క్యూ లైన్ లో ఉండి బార్ కోడింగ్ వేయించుకునేందుకు వెయిట్ చేశారు. నిలబడే ఓపిక లేనివారికి కుర్చీలు కూడా లేక నేలపైనే కూర్చున్నారు. కొంత మందికే బార్ కోడింగ్ ఇచ్చిన సిబ్బంది, సర్వర్ ప్రాబ్లమ్తో సాఫ్ట్వేర్ పోయిందని 11 గంటలకు చెప్పారు. టిఫిన్ కూడా చేయకుండా వచ్చామంటూ గర్భిణులు.. సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బార్ కోడింగ్ లేకుంటే..
సుమారు15 లక్షల జనాభాకు సేవలందించాల్సిన వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో టెస్టులు చేసేందుకు సౌలత్లు లేవు. గర్భిణులకు ఏఎన్సీ ప్రొఫైల్ చేయాల్సి ఉండగా హెచ్బీ, బీటీసీపీ,హెచ్బీఎస్ఏజీ, వీడీఆర్ఎల్, బ్లడ్ గ్రూప్ టెస్ట్ లు మాత్రమే చేస్తున్నారు. మిగతా టెస్ట్ల కోసం నారాయణగూడలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తున్నారు. బార్ కోడింగ్ లేకుండా టెస్ట్లు చేయడానికి వీలు లేదని ఆదేశాలు ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది.
రెండు రోజులుగా తిరుగుతున్నా..
మా ఊరు నుంచి ఇక్కడికి ముప్పై కిలోమీటర్లు ఉంటది. తెల్లారుజామున 5 గంటల బస్సుకు వచ్చినా. సర్వర్ ప్రాబ్లమ్ ఉందని టెస్ట్ లు చేయలేదు. చిన్న పిల్లలను వదిలేసి రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకుంటలేదు.
- సరిత, ఇబ్రహీంపట్నం