- సాయిబాబా భార్య వసంత ఆవేదన
- ఢిల్లీలో ప్రొఫెసర్ సంస్మరణ సభ
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో జైళ్లు టార్చర్ సెల్స్గా మారాయని ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత కుమారి అన్నారు. ఏం నేరం చేశారో తెలియకుండానే తన భర్త సాయిబాబా పదేళ్లు జైల్లో టార్చర్ పడ్డారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ‘‘నా బాల్య మిత్రుడు, సహచరుడు, నన్ను విడిచి వెళ్లిపోయాడు’’ అని ఉద్వేగానికి గురయ్యారు.
ఆదివారం ఢిల్లీలోని జవహర్ భవన్ లో సాయిబాబా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు సాయిబాబా భార్య వసంతతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ నందిని సుందర్, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు నందిత, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పీఆర్ డీ) జనరల్ సెక్రటరీ మురళీధరన్, ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ సాయిబాబా మృతికి న్యాయ వ్యవస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే కారణమని ఆరోపించారు. ‘‘సాయిబాబా పదేళ్ల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆ టైంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దానికి బాధ్యులెవరు?’’ అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను జవాబుదారీలుగా చేస్తూ కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే పోలీసు వ్యవస్థ మరింత బాధ్యతగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.
