ఆర్టీసీ ఆస్తులపై ప్రైవేటు కన్ను.. కొన్నేళ్లుగా వారిదే ఇష్టారాజ్యం

ఆర్టీసీ ఆస్తులపై ప్రైవేటు కన్ను.. కొన్నేళ్లుగా వారిదే ఇష్టారాజ్యం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఆస్తులపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడింది. కొన్నేళ్లుగా వారిదే ఇష్టారాజ్యం. విలువైన స్థలాలను లీజుకు తీసుకొని.. వ్యాపారాలు నడిపిస్తున్నారు.  వరంగల్‌‌‌‌లో విలువలైన ఆర్టీసీ స్థలాన్ని ఒక ఎంపీ అనుచరుడికి, ఆర్మూర్‌‌‌‌లోని స్థలాన్ని ఒక ఎమ్మెల్యే అనుచరుడికి, కరీంనగర్‌‌‌‌లో  ఒక ప్రజాప్రతినిధి సమీప బంధువులకు అప్పగించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ స్థలాల్లో సుమారు వంద చోట్ల పెట్రోల్‌‌‌‌ బంకులకు స్థలాలు లీజుకు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. కాగా అందులో సగం స్థలాలను ఒక ఎంపీకి చెందిన బంధువులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ఆర్టీసీ ఆస్తుల పరిస్థితి ఇలా ఉంది…

వరంగల్​ సిటీలో విలువైన ఆర్టీసీ స్థలాలన్నీ ఈ రెండేండ్లలోనే ప్రైవేటు వ్యక్తులకు ఫలహారమయ్యాయి. హన్మకొండ హంటర్ రోడ్డులో ఆర్టీసీ  టైర్ రెట్రేడింగ్ స్థలాన్ని రెండేండ్ల కిందట లీజుకు ఇచ్చారు. అదాలత్​ నుంచి వరంగల్​ వెళ్లే మెయిన్​ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్థలం విలువ దాదాపు రూ.80 కోట్లు. రాం నగర్ పాత బస్ డిపో వద్ద మరో రూ.25 కోట్ల విలువ చేసే సిబ్బంది క్వార్టర్స్ స్థలాలను లీజుకు అప్పగించారు. విలువైన ఈ భూములను లీజుపేరిట కట్టబెట్టడం వెనుక కొందరు కీలక నేతలే బినామీలుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ‘రోని భారత్‍ గ్యాస్‍’ సంస్థ  ఏడాదికి రూ.48 లక్షలు ఇచ్చే అగ్రిమెంట్​పై ఈ స్థలాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఇక్కడ మల్టీప్లెక్స్​ నిర్మించేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్​ పాత బస్​ డిపో దగ్గరున్న రూ.25 కోట్ల విలువైన స్టాఫ్‍ క్వార్టర్స్​ స్థలాన్ని  33 ఏండ్లకు  ‘జుబ్లీ ఇన్ఫ్రాస్’కు లీజుకు ఇచ్చారు.  ఏడాదికి రూ.46 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారు. మాస్టర్​ ప్లాన్​ ఓకే కాగానే ఇక్కడ కూడా బడా మాల్​ నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ బస్టాండ్​ పరిసరాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులున్నాయి.  కరీంనగర్‍ డిపో .. బస్ స్టేషన్‍ కలిపి  18 ఎకరాలు. దీని విలువ సుమారు రూ. 350 కోట్లు ఉంటుంది. కరీంనగర్​ జగిత్యాల రూట్​ లో ఉన్న జోనల్‍ వర్క్ షాప్ 53 ఎకరాల్లో ఉంటుంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్లు, బస్టాండ్​ చుట్టుపక్కలా ఎకరం స్థలంలో కమర్షియల్‌‌‌‌‌‌‌‌ షాపింగ్​ కాంప్లెక్స్​తోపాటు  ఆంధ్రా బ్యాంకు కు లీజుకు ఇచ్చారు.  మరో పక్క ప్రతిమ మల్టిప్లెక్స్ ఉన్న ఎకరం స్థలాన్ని వంద  ఏండ్లకు లీజుకు ఇచ్చారు. హుజురాబాద్ డిపో పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్​ రూ. ఏడు కోట్లకుపైగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్​ను ఆనుకొని ఉన్న షాపింగ్​ కాంప్లెక్స్​ విలువ రూ. 5 కోట్లు.

మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలో రూ.25 కోట్లకు పైగా విలువైన  పాత బస్టాండ్ స్థలాన్ని 33 ఏండ్లకు ఓ లీడర్ కు లీజుకు ఇచ్చారు. ఇక్కడి పాత డిపో స్థలాన్ని కూడ ఓ ఫంక్షన్ హల్​కు  లీజుకు ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. పది కోట్లు.  జడ్చర్ల , మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్లలతో పాటు నారాయణపేట, మక్తల్, కొస్గి, దేవర్ కద్ర, మరికల్, మద్దురు బస్టాండ్ లలో షాపులకు అద్దెతోనే నెలకు రూ.50 లక్షలు వస్తాయి.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బస్టాండ్ 2 ఎకరాల్లో ఉంటుంది. దీని విలువ  రూ. 5కోట్లు. బస్ డిపో 5 ఎకరాలు విలువ 10 కోట్లు.  అచ్చంపేట బస్టాండ్, డిపో దాదాపు 9 ఎకరాలు 20 కోట్ల విలువ ఉంటుంది. కల్వకుర్తి బస్ డిపో 6 ఎకరాలు, బస్టాండ్ 3 ఎకరాలు విలువ 25 కోట్లు ఉంటుంది. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ బస్టాండ్ల ముందున్న షాపింగ్ కాంప్లెక్స్ లున్నాయి.  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో… విలువైన స్థలాలు ఉన్నాయి. ఇటీవల కొంత స్థలాన్ని పెట్రోల్ బంక్​కు లీజుకు ఇచ్చారు.  మిగతా సగం  ఖాళీ గా ఉంది.

సిద్దిపేటలో పాత బస్టాండ్ ఎకరం స్థలం, బస్ డిపో తో పాటు కొత్త బస్టాండ్ లు కలుపుకుని మొత్తం అయిదు ఎకరాలు ఉంటుంది.  వీటి విలువ దాదాపు రూ.20 కోట్లపైనే ఉంటుంది. పాత బస్టాండు విలువ రూ.10 కోట్లు ఉంటుంది. సిద్దిపేట బస్ డిపో కు చెందిన స్థలంలో  ఇటీవలే పెట్రోల్ పంప్ కు లీజుకు ఇచ్చారు. పాత బస్ స్టాండు ను కూల్చి వేసి పీపీపీ పద్ధతిలో మల్టీ ప్లెక్స్, బస్ స్టాండ్ కట్టాలని నిర్ణయించి, పత్రిక ప్రకటన ఇచ్చి ఏడాది గడుస్తోంది. మెదక్ లో ఆర్టీసీ బస్ డిపో, కొత్త బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్,  సిబ్బంది క్వాటర్స్ స్థలం, పాత బస్టాండ్, షాప్ లు కలిపి కలిపి దాదాపు 12  ఎకరాలు విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఆర్టీసీ మెదక్ డిపో ఆస్తుల విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుంది.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయిదు ఎకరాల స్థలంలో బస్టాండ్, బస్ డిపో ఉన్నాయి. ఏసీసీ ఏరియాలో సిబ్బంది రెసిడెన్షియల్ క్వార్టర్స్ తో పాటు మూడెకరాల ఖాళీ స్థలం ఉంది. బెల్లంపల్లి, మండమర్రి, చెన్నూరు, జైపూర్, లక్షెట్టిపేట, జన్నారంలో బస్టాండ్లు ఉన్నాయి. అంతా కలిపి ఇరవై ఎకరాల స్థలం ఉంది. మంచిర్యాల, బెల్లంపల్లి, మండమర్రి, చెన్నూరు, లక్షెట్టిపేట, జన్నారంలో షాపింగ్ కాంప్లెక్స్​లున్నాయి. వీటి విలువ రూ.వంద కోట్లకుపైగా ఉంటుంది.

జగిత్యాల డిపో ,బస్టాండ్ కలిపి 21 ఎకరాలు,మెట్ పల్లిలో పది ఎకరాల విలువైన భూములు ఆర్టీసీ సొంతం. ఇటిక్యాల్ కి చెందిన కృష్ణారావు కోరుట్ల ఆర్టీసీకి పది ఎకరాలు డొనేట్​ చేశారు. ఇప్పుడు ఈ భూముల విలువ కనీసం రూ.50 కోట్లు దాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కి 13 ఏకరాల భూమి..ఇందులో భవనం ఉంది..దిని విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం రూ.50 కోట్లు.. వేములవాడ లో డిపో రూ.30 కొట్లు మొత్తం రూ.80 కోట్ల అస్తులు ఉన్నాయి.

మహబూబాబాద్​ జిల్లాలో ని తొర్రూర్​ బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, స్థలం విలువ రూ.60 కోట్ల వరకు ఉంటుంది. అయిదు ఎకరాల్లో బస్ డిపో  ఉంది. దీని విలువ రూ.10 కోట్లు, మహబూబాబాద్ డిపో బస్టాండ్ స్థలం విలువ సుమారుగా 20 కోట్ల వరకు ఉంటుంది. కామారెడ్డి బస్టాండ్​, డిపో కలిపి పదకొండు ఎకరాలుంది. దాదాపు రూ,60 నుంచి రూ.70 కోట్ల వరకు విలువ ఉంటుంది.  బాన్సువాడలో  దాదాపు  రూ.30 కోట్ల ఆస్తి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో దాదాపు  రూ. 80 కోట్ల విలువైన స్థలాలున్నాయి.

ఉమ్మడి నల్గొండ రీజియన్​లో ఆర్టీసీ బస్టాండ్ల సమీపంలో నిర్మించిన షాపుల విలువ రూ.16.05 కోట్లు. ఆర్టీసీ స్థలాల్లో 13 పెట్రోల్ బంక్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇంకా ఏర్పాటు కాలేదు. సూర్యాపేట కొత్త బస్ స్టాండ్  హైటెక్ బస్టాండ్ లు 10 ఎకరాలలో  విస్తరించింది. దీని విలువ సుమారు 50 కోట్లు. కోదాడ బస్ స్టాండ్, డిపో కలిపి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీని విలువ సుమారు రూ.80కోట్లు ఉంటుంది. హుజూర్​ నగర్​, గరిడేపల్లి లలో ఆర్టీసీకి బస్టాండ్లు ఉన్నాయి. అవి నిరుపయోగంగా ఉన్నాయి.ఈ ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుంది.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో దుకాణ సముదాయం నిర్మించారు. నెలకు రూ. 10 లక్షలు అద్దే వస్తుంది…దుకాణాలకు గాను డిపాజిట్ రూ.75 లక్షల వరకు ఉంది. మిగిలిన ఖాళీ స్థలం విలువ 15 కోట్ల వరకు ఉంది.  నారాయణపేట బస్టాండ్ ఎదురుగా 2ఎకరాల స్థలం ఉంది…దీని విలువ రూ25, కోట్లు ఉంటుంది.