ప్రైవేట్ మెడికల్ పీజీలకు షాక్..అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో 20 మార్కులు కట్ 

ప్రైవేట్ మెడికల్ పీజీలకు షాక్..అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో 20 మార్కులు కట్ 
  • ఉద్యోగాల్లో కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతున్న ప్రైవేట్ పీజీ డాక్టర్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో కొన్ని నిబంధనలు కొందరికి అనుకూలంగా ఉన్నాయంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనల వల్ల ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ చేసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా పోతాయని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా నోటిఫికేషన్ ప్రకారం, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారికి 20 మార్కులను కేటాయించారు. అలాగే, మెడికల్ పీజీ డిగ్రీ తర్వాత తప్పనిసరిగా సీనియర్ రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఏడాది పాటు పనిచేసిన వారికి కూడా ఈ 20 మార్కుల వెయిటేజీ వస్తుంది. అయితే, ప్రభుత్వ కాలేజీల్లో పీజీ చేసిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా పనిచేసే అవకాశం ఇస్తుండటంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది.  

ప్రైవేటు పీజీలకు అన్యాయం

ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ డిగ్రీ చేసిన వారికి, ముఖ్యంగా బీ కేటగిరీ, సీ కేటగిరీ కింద చేరిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ రెసిడెన్సీ చేయడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. నిబంధనల ప్రకారం, వారు పీజీ డిగ్రీ చదివిన వైద్య కళాశాలలోనే ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా పని చేయాలి. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివిన వారితో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్ రెసిడెన్సీ చేసే అవకాశం ప్రైవేటు పీజీలకు లేకుండా పోతుంది.

ఫలితంగా, ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం వారికి 20 మార్కులు వచ్చే అవకాశం కూడా ఉండదు. అందుకే.. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే సీనియర్ రెసిడెన్సీ ఎక్కడ చేసినా కూడా 20 మార్కులు కేటాయించేలా నిబంధనలు సవరించాలని పీజీ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కొందరికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఉద్యోగాలు భర్తీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు, వాటిలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా చేయడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ రెసిడెన్సీ ఎక్కడ చేసినా ఆ మార్కులకు అర్హులుగా పరిగణించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.