
- సర్కారు బడుల్లో లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు..
- ఫస్ట్ క్లాసులో 55 వేలకు పైగా ప్రవేశాలు
- రెండు లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు, బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లోనే లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు వచ్చాయి. కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలోనే ఉన్నాయి. అయితే, ప్రైవేటు బడుల నుంచి సర్కారు స్కూళ్లకు వస్తున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఈ నెల12 నుంచి 2025–26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. మంగళవారం నాటికి కొత్తగా 1.17 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. దీంట్లో ఒకటో తరగతిలోనే 55 వేలకు పైగా స్టూడెంట్లున్నారు. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు మరో 61 వేలమంది ప్రవేశం పొందారు. గతేడాది ఒకటో తరగతిలో 1.74 లక్షల మంది చేరారు. ఈ సారి రెండు లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రైవేటు నుంచి సర్కారులోకి..
ప్రైవేటు బడుల నుంచి సర్కారు స్కూళ్లలోకి వలసలు మొదలయ్యాయి. స్కూళ్లు తెరిచిన ఐదు రోజుల్లోనే ఏకంగా 18 వేల మంది ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి రావడం గమనార్హం. వీళ్లంతా కూడా రెండో తరగతి నుంచి టెన్త్ వరకు ఉన్న స్టూడెంట్లే. ఇది సర్కారు బడులపై పేరెంట్స్ లో విశ్వాసం పెరుగుతున్నట్టు తెలుపుతోందని విద్యావేత్తలు చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం వేదికగా మారింది. మరోపక్క టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ లాంటి సంఘాలు ప్రత్యేకంగా జాతాలు పెట్టి, గ్రామాల్లో కళారూపాలతో పేరెంట్స్ ను చైతన్యవంతం చేయడంలో కీలక భూమిక పోషించాయి.
ఫలితాలిస్తున్న సర్కారు నిర్ణయాలు..
ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా పదివేలకు పైగా టీచర్లను నియమించగా, ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చింది. దీనికితోడు 1.10 లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికితోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి. మరోపక్క బడులు తెరిచిన రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు.