మోడీ పబ్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా : ప్రియాంక గాంధీ

మోడీ పబ్లిసిటీ చూసి ఆశ్చర్యపోయా : ప్రియాంక గాంధీ

దేశం సంగతి పక్కన పెడితే… ఎంపీగా తన సొంత నియోజకవర్గం వారణాసిని కూడా ప్రధాని మోడీ అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. అయోధ్యలో నిర్వహించిన బహిరంగసభలో ప్రియాంక పాల్గొన్నారు.

మోడీ పబ్లిసిటీని చూసి తాను ఆశ్చర్యపోయానని… కానీ వారణాసిలో ఏమీ అభివృద్ధి జరగలేదన్నారు. ప్రపంచ దేశాలు తిరిగేంత టైమ్ మోడీకి ఉంటుంది కానీ… వారణాసి నియోజకవర్గంలోని గ్రామాల్లోకి మాత్రం వెళ్లలేకపోయారని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదకు కనీస ఆదాయం అందిస్తుందన్నారు.

అయోధ్య వెళ్తుండగా మార్గమధ్యంలో కుమార్ గంజ్ లో స్థానికులతో మాట్లాడారు ప్రియాంక. మహిళలను కలిశారు. ఎండలో కింద కూర్చుని మహిళలతో ముచ్చటించారు ప్రియాంక.

రెండు రోజులుగా యూపీలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా.. అయోధ్యకు మార్గ మధ్యంలో రాహుల్ గాంధీ నియోజక వర్గం అమేథిలో పార్టీ కార్యకర్తలను కలిశారు. స్థానికులతో ముచ్చటిస్తూ వారితో షేక్ హ్యాండ్ చేశారు. చిన్న పిల్లలతో సెల్ఫీలు దిగారు.