ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్య విధ్వంసమైందని ప్రొఫెసర్ హర గోపాల్ ఆరోపించారు. రాష్ట్రంలోని12 వర్సిటీల్లో 1,445 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్చేయాలని డిమాండ్ చేశారు. స్టేట్ వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో సామూహిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రొఫెసర్ హర గోపాల్ హాజరై మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ పోవాలన్నారు. 20 ఏండ్ల నుంచి వర్సిటీల ఉన్నతికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కృషి చేశారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్చేయవలసిన అవసరం ఉందని, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ దీక్షలో జేఏసీ చైర్మన్ వేల్పుల కుమార్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తాళ్లపల్లి వెంకటేశ్, ఎస్ ఎన్ అర్జున్ కుమార్, సి. విజేందర్ రెడ్డి, చీర రాజు, ఉపేందర్ రావు, భవాని, రాధిక, లక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.