సొంతగడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న తెలుగు టైటాన్స్ లీగ్లో వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. తొలి మ్యాచ్లో యు ముంబా చేతిలో ఓడిన లోకల్ టీమ్, తమ రెండో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ చేతిలో పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 26–39 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిపోయింది.10 పాయింట్లు స్కోర్ చేసిన రాహుల్ చౌదరి, 6 పాయింట్లు రాబట్టిన మన్జీత్ చిల్లర్ తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆరు పాయింట్లు స్కోర్ చేసిన స్టార్ ప్లేయర్ సిద్దార్థ్ దేశాయ్ టైటాన్స్ జట్టులో టాప్స్కోరర్. ఫస్టాఫ్ ముగిసేసరికి 10–20తో వెనుకంజలో ఉన్న టైటాన్స్ ఏ దశలోను విజయం దిశగా సాగలేదు. బుధవారం జరిగే తమ మూడో మ్యాచ్లో తెలుగు టైటాన్స్, దబాంగ్ ఢిల్లీతో తలపడనుంది.
జెయింట్స్ సూపర్ బోణీ
పీకేఎల్ ఏడో సీజన్ను గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ సూపర్ విక్టరీతో ప్రారంభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు 42–24తో బెంగళూరు బుల్స్ను చిత్తుగా ఓడించి సీజన్ను భారీ విజయంతో ప్రారంభించింది. జెయింట్స్ ఆటగాళ్లు సచిన్(7 పాయింట్లు), సునీల్ కుమార్(6), జీబీ మోరె(6) రాణించారు. బుల్స్ ప్లేయర్ పవన్ షెరావత్ 8 పాయింట్లు స్కోరు చేసినా మిగిలిన వారు విఫలమవడంతో ఓటమి తప్పలేదు. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 21–10తో భారీ లీడ్లో ఉన్న జెయింట్స్ సెకండాఫ్లో మరింత దూకుడుగా ఆడింది. బుల్స్ రైడర్లు పాయింట్ల కోసం తంటాలు పడుతుంటే చకాచకా పాయింట్లు చేస్తూ ఆధిక్యాన్ని పెంచేసిన జెయింట్స్ ఆటగాళ్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

