
తెలంగాణ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లా భారీగా నష్టపోయింది. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఇప్పటికీ చాలా మంది సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. వరద బాధితులను ఆదుకొనేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. సినీ హీరో ఉదయ్ శంకర్ కూడా ముందుకొచ్చారు. ఖమ్మం జిల్లా వరద బాధితులకు సహాయం చేయడం కోసం నిర్మాత అట్లూరి నారాయణ రావు, హీరో ఉదయ్ లు తెలంగాణ ప్రభుత్వానికి రూ. 2 లక్షలు అందచేశారు. మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ను వీరు కలిసి చెక్కును అందచేశారు.
వీరిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయటం సాటి మనిషి కర్తవ్యమన్నారు. ప్రజల సహకారం వల్లే సినీ రంగం ఈ స్ధాయిలో ఉందని, వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమతో పాటు పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్ధలు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో తాడికొండ సాయికృష్ణ, వీరపనేని శివ చైతన్యలున్నారు. సినీ హీరో ఉదయ్ విషయానికి వస్తే.. ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నటించారు. అట్లూరి నారాయణ రావు ఈ సినిమాను నిర్మించారు.