
వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్పోర్ట్లో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఎయిర్పోర్ట్లోని రోడ్ల నిర్మాణ ప్రదేశాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. గుంటూర్పల్లి నుంచి వరంగల్, ఖమ్మం నేషనల్ హైవే వరకు, నక్కలపల్లి నుంచి గాడిపల్లి, గాడిపల్లి బైపాస్ వరకు ఏర్పాటు చేయనున్న తదితర రోడ్ల స్థలాలను పరిశీలించి, ప్రభుత్వానికి పంపడానికి ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు.
అంతకుముందు కలెక్టరేట్లో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఐఆర్ఆర్, మెగా టెక్స్టైల్ పార్క్లో రాజీవ్ మెగా టౌన్షిప్ లేఔట్ పర్మిషన్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఐఆర్ఆర్ ఏర్పాటులో గొర్రెకుంట, ఏనుమాముల, ఖిలా వరంగల్, ఉర్సు గ్రామాలకు చెందిన భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారం చెల్లింపులు చేపట్టాలన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వం భూపట్టాలు అందజేసిన 863 మందికి లేఔట్ పర్మిషన్ల మంజూరు అందజేయాలని చెప్పారు.