
- హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హరేరామ హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మిస్తున్నారు. ఈ పనులపై హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆదివారం హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని 28 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం ప్రారంభించనున్నారు.