ఓజోన్ పొరను మొదటిసారిగా సి.ఎఫ్. స్చోబ్బీన్ గుర్తించారు. మూడు పరమాణువుల ఆక్సిజన్ను ఐసోటోప్ ఆక్సిజన్గా పిలుస్తారు. భూ ఉపరితలానికి సరాసరి 20 – 25 కి.మీ.ల ఎత్తులో స్ట్రాటోస్ఫియర్ వాతావరణ పొరలో ఓజోన్ పొర విస్తరించి ఉంటుంది. సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అంబ్రెల్లా మాదిరిగా ఓజోన్ పొర కాపాడుతుంది. ముఖ్యంగా యూవీ–బి కిరణాల బారి నుంచి సంరక్షిస్తుంది. ఓజోన్ పొరను డియూ(డబ్సన్ యూనిట్ల)లో కొలుస్తారు.
ఓజోన్ పొర
స్ట్రాటోస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ పరమాణువులు సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలతో చర్య జరిపి రెండు ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోతాయి. ఒక ఆక్సిజన్ పరమాణువు మరో ఆక్సిజన్ పరమాణువుతో జరిపే చర్య వల్ల ఓజోన్ పొర ఏర్పడుతుంది.
విచ్ఛిన్నతకు కారణాలు
ఓజోన్ పొర విచ్ఛిన్నతకు కారకంగా క్లోరోఫ్లోరో కార్బన్(సీఎఫ్ సీఎల్)ను గుర్తించారు. దీనిని సాధారణంగా ఫ్రియాన్గా పిలుస్తారు. ఫ్రియాన్ను రిఫ్రిజిరేటర్లలో ఉపయోగిస్తారు. ఇవేకాకుండా ఏరోసోల్స్, క్లీనింగ్ ఏజెంట్స్ కూడా ఓజోన్ విచ్ఛిన్నతకు కారణం అవుతాయి. స్ట్రాటోస్ఫియర్లో ఉండే హలోన్, బ్రోమిన్ ఆటమ్స్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు (వీటిని సూపర్ సోనిక్ జెట్ విమానాలు విడుదల చేస్తాయి) ఓజోన్ విచ్ఛిన్నతకు కారణమవుతాయి. బ్రిటిష్ శాస్త్రవేత్త జోసెఫ్ ఫోర్మెన్ 1985లో తొలిసారిగా అంటార్కిటికా ఖండంలో ఓజోన్ పొర విచ్ఛిన్నతను గుర్తించారు.
దుష్ఫలితాలు
ఓజోన్ పొర విచ్ఛిన్నత వల్ల అతినీల లోహిత కిరణాలు భూమిని నేరుగా చేరడం వల్ల భూఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల మంచుతో కప్పి ఉండే ప్రాంతాల మంచు కరిగిపోతుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా జీవులను తాకడం ద్వారా చర్మ క్యాన్సర్లు వస్తాయి. రోగనిరోధక శక్తి నశిస్తుంది. మానవులకు శ్వాస సంబంధ వ్యాధులు పెరుగుతాయి. ఎక్కువ కాలం మానవులను అతినీల లోహిత కిరణాలు తగలడం ద్వారా జన్యు సంబంధ వ్యాధులు సంభవిస్తాయి.
యూఎన్ఓ చర్యలు
వియన్నా కన్వెన్షన్: 1985లో ఓజోన్ పొర క్షీణతకు సంబంధించి పలు సూచనలు చేసిన మొదటి కన్వెన్షన్ ఇది. ఈ ఒప్పందంపై 20 దేశాలు సంతకాలు చేశాయి.
మాంట్రియల్ ప్రోటోకాల్: 1987లో కెనడాలోని మాంట్రియల్లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం. ఇది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఓజోన్ క్షీణతకు కారణమైన పదార్థాల విడుదలను నియంత్రించడం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు ఓజోన్ క్షీణతకు కారణమైన సీఎఫ్సీలను, ఇతర పదార్థాలను నియంత్రించే విధానానికి సంబంధించి రోడ్ మ్యాప్స్ సూచించారు. ఈ ప్రోటోకాల్ క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని 2000 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాలని పేర్కొన్నది. ఈ ఒప్పందం జరిగిన సెప్టెంబర్ 16ను ఓజోన్పొరను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సూచిస్తూ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా పాటించాలని మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంలో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. 1991లో ఓజోన్ పొర పరిరక్షణకు యూఎన్ఓ ఆధ్వర్యంలో వియన్నాలో జరిగిన ఒప్పందంపై 1992లో భారత్ సభ్య దేశంగా సంతకం చేసింది. ఈ సమావేశంలో 2030 నాటికి ఓజోన్ క్షీణతకు కారణమైన ఫర్ హైడ్రోక్లోరో ఫ్లోరో కార్బన్స్ విడుదలను పూర్తిగా నియంత్రిస్తామని భారత్ పేర్కొన్నది. ఇది పర్యావరణ పరిరక్షణపై దేశ నిబద్ధతను చాటుతున్నది.
లండన్ సదస్సు: 1992లో జరిగిన ఈ సదస్సులో క్లోరోఫ్లోరో కార్బన్లకు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తృతీయ ప్రపంచ దేశాలకు బదిలీ చేయడానికి ఒప్పందం జరిగింది. వీటిని అమెరికా వంటి అగ్రదేశాలు పూర్తి నిషేధించాయి. భారత్లో సీఎఫ్ సీలకు ప్రత్యామ్నాయంగా హెచ్ఎఫ్సీ పదార్థాన్ని తయారు చేసి రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనర్లలో ఉపయోగిస్తున్నారు.
కిగాలి ఒప్పందం: రువాండా రాజధాని కిగాలిలో 2016, అక్టోబర్లో వాతావరణంలోకి విడుదలవుతున్న ఓజోన్ పొర క్షీణతకు కారణమైన హైడ్రోఫ్లోరో కార్బన్(హెచ్ఎఫ్సీ)లను నియంత్రించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇందులో 197 దేశాలు పాల్గొన్నాయి. సీఎఫ్సీలకు బదులుగా హైడ్రోఫ్లోరో కార్బన్లను రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లలో వినియోగించేవారు. కానీ హెచ్ఎఫ్సీల వల్ల కూడా వాతావరణం వేడెక్కుతూ ఉండటంతో వీటిని కూడా ఈ సమావేశంలో నిషేధించారు. ఈ ఒప్పందం మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందానికి సవరణ. కిగాలి ఒప్పందంలో పాల్గొన్న సభ్యదేశాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఇందులో భారత్ మూడో గ్రూపులో ఉన్నది.
భూమిపై వర్షాలు, జలాశయాల ప్రభావంతో ఎమినో ఆసిడ్స్ ఏర్పడి, వాటి నుంచి తొలి ఏకకణ జీవులు ఉద్భవించాయనేది జీవపరిణామ క్రమంలోని ప్రధాన సిద్ధాంతం. వీటిలో ముఖ్యంగా నీలి ఆకుపచ్చ శైవలాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సౌరశక్తిని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని, ఆక్సిజన్ను వాతావరణంలోకి విడుదల చేయడం వల్ల భూవాతావరణం ఆక్సిజన్ రిచ్గా మారింది.
ఓజోన్ ఏర్పడే విధానం: వాతావరణంలో పెరిగిన ఆక్సిజన్, సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావంతో రసాయనిక చర్య జరిపి ఓజోన్ (O3) గా మారుతుంది.
ఓజోన్ పొర విస్తరణ: వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్ ప్రాంతంలో 25 నుంచి 35 కి.మీ.ల ఎత్తులో సుమారు 90 శాతం ఓజోన్ కేంద్రీకృతమై ఉంటుంది. ఇది సూర్యుని హానికారక యూవీ కిరణాలను అడ్డుకుంటూ భూమిపై జీవజాలానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మిగతా 10 శాతం ట్రోపోస్ఫియర్ లో ఉంటుంది.
ట్రోపోస్ఫియర్లో ఓజోన్ ప్రభావం: వాతావరణ దిగువ పొర అయిన ట్రోపోస్ఫియర్లో ఈ ఓజోన్ మోతాదు పరిమితిని మించితే అది విషపూరిత కాలుష్య కారకంగా మారుతుంది. ఇది వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలతో కలిసి 'స్మాగ్' ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మానవుల్లో శ్వాసకోశ సమస్యలకు మరియు పర్యావరణానికి హాని కలిగిస్తుంది.
