
రాజ్ భవన్ ముందు ఉద్రిక్త నెలకొంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ పై ఫిర్యాదు చేసేందుకు జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లు, పలువురు మహిళా నేతలు రాజ్ భవన్ కు వచ్చారు. అయితే గవర్నర్ తమిళి సై అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో మేయర్, మహిళా కార్పొరేటర్లు రాజ్ భవన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వినతి పత్రాలను రాజ్ భవన్ గోడకు అంటించారు. బీజేపీకి, గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు ఆందోళన చేస్తామన్నారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత డిమాండ్ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు మేయర్ తో పాటు మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు..