ఎల్ బీనగర్, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఎల్బీనగర్ చింతలకుంటలో ఓ వ్యక్తి రేడియో టవర్ఎక్కి నిరసన తెలిపాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. లింగోజిగూడ అధికారినగర్ కు చెందిన బొల్లెద్దుల నర్సింగ్రావు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాలనీలోని రేకుల షెడ్లలో ఉంటున్న 45 కుటుంబాలు వర్షం కురిసిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నాయని, జాగా ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని సీఎం కేసీఆర్, గవర్నర్, జిల్లా కలెక్టర్కు నర్సింగ్ గతంలో వినతిపత్రాలు ఇచ్చాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్
అక్కడికి వచ్చి నర్సింగ్ రావుతో
ఫోన్లో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అతడు కిందికి దిగాడు. నర్సింగ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. 2018లో నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ జాగా ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించాడు. ఇప్పటికైనా ఇల్లు కట్టుకునేందుకు తనకు సాయం చేయాలని కోరాడు.