- విధులు బహిష్కరించి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల నిరసన
- ఇయ్యాల చర్చలు జరపనున్న సర్కార్?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 29 సర్కార్ దవాఖాన్లలో పని చేస్తున్న 698 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు బుధవారం విధులు బహిష్కరించారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఓపీ, ఐపీ సేవలనే బహిష్కరించామని, ప్రభుత్వం స్పందించకపోతే శుక్రవారం నుంచి ఎమర్జెన్సీ డ్యూటీలకూ హాజరు కాబోమని హెచ్చరించారు. ప్రభుత్వం 3 నుంచి 8 నెలల పాటు జీతాలు చెల్లించడంలేదని, దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోగా వేతనాలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. కాగా, డాక్టర్లతో ప్రభుత్వం గురువారం చర్చలు జరపనున్నట్టు తెలిసింది.