ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు నిరసన సెగ

ఎమ్మెల్యే  శంకర్ నాయక్ కు నిరసన సెగ

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్​ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కు శుక్రవారం నిరసన సెగ తగిలింది. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు మహబూబాబాద్ మున్సిపాలిటిలోని 9,10 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శనిగపురం సమీపంలోని బోడ తండాలో పర్యటిస్తుండగా ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. పదేండ్లుగా ఏ ఒక్క సమస్య ను పరిష్కరించలేదని నిలదీశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ రాం భద్రయ్య ఆధ్వర్యంలోనే అభివృద్ది జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని గ్రామంలోకి వస్తున్నారా? అని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఊరిలోకి రావొద్దని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే శంకర్​నాయక్​ అన్ని డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పోలీసులు కూడా సర్ధి చెప్పడంతో ఆందోళన విరమించారు.